
మలయాళ నూతన సంవత్సరం, పవిత్ర చింగం మాసం ప్రారంభం సందర్భంగా శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి. నెలవారీ పూజల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచారు.
ఉదయం 5 గంటల నుంచి క్యూలైన్ల ద్వారా భక్తులను కొండపైకి అనుమతించారు. ప్రధాన పూజారి కందరారు బ్రహ్మదత్తన్ నేతృత్వంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమలకు తరలివచ్చారు.
ఆగస్టు 21 వరకు నెలవారీ పూజలు
చింగం మాసం సందర్భంగా నిర్వహిస్తున్న నెలవారీ పూజలు ఆగస్టు 21 రాత్రి వరకు కొనసాగనున్నాయి. అనంతరం ఓనం పండగ వేడుకల సందర్భంగా ఆగస్టు 24న ఆలయ ద్వారాలను మరోసారి తెరవనున్నారు.
భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దర్శనం కోసం ఆన్లైన్ వర్చువల్ క్యూ బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులో ఉంచడంతో పాటు, భక్తుల రాకపోకలకు అనుగుణంగా కేరళ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
చింగం మాసం సందర్భంగా శబరిమలలో అయ్యప్ప నామస్మరణలు మార్మోగుతుండగా, స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.





