
పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధి చూపించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించిన కరోనా అత్యవసర నిధి ఏర్పాటులో మొండి చేయి చూపించింది. ఇటీవల మోడీ పిలుపు మేరకు ఏర్పాటు చేసిన సార్క్ దేశాల సమావేశానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా అత్యవసర నిధికి సైతం ఎలాంటి సాయం చేయలేదు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న క్రమంలో తానిచ్చిన పిలుపును స్వాగతించి సహకరించిన సార్క్ దేశాలకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇటీవల ఏర్పాటు చేసిన సార్క్ సమావేశంలో మోడీ మాట్లాడుతూ కరోనాపై ఏ ఒక్కరం ఒంటరిగా విజయం సాధించలేం, అందరం కలిస్తేనే విజయం సాధ్యమని అందరిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కోవిడ్19 అత్యవసర నిధిని ప్రతిపాదించారు. 10మిలియన్ డాలర్ల నిధి ఏర్పాటు చేసి దాన్ని కరోనాపై పోరాడేందుకు వినియోగిద్దామని ఆయన సార్క్ దేశాలను కోరారు. దీనికి సమ్మతించిన సార్క్ సభ్య దేశాలు బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, నేపాల్ తమ వంతు నిధిని ప్రకటించాయి. బంగ్లాదేశ్ 1.5మిలియన్ డాలర్లు, అఫ్గానిస్థాన్ ఒక మిలియన్ డాలర్లు ప్రకటించగా మాల్దీవులు 2లక్షల డాలర్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. శ్రీలంక మరో అడుగు ముందుకు వేసి 5మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే భూటాన్ సైతం నిధి ఏర్పాటుకు దూరంగా ఉండటం గమనార్హం.





