News

దేశ భక్తి కలిగిన పౌరులను తీర్చిదిద్దడమే విద్యాభారతి లక్ష్యం : గోవింద్ మహంత్

27views

న్యూఢిల్లీ : నోయిడా కేంద్రంగా విద్యా భారతికి చెందిన అఖిల భారత ప్రచార విభాగ్, అభిలేఖాగార్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి. నోయిడా లోని భావురావ్ దేవరస్ సరస్వతీ విద్యా మందిర్ లో జరుగుతున్న ఈ సమావేశాలకు అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యా భారతి అఖిల భారతీయ సంఘటనా కార్యదర్శి గోవింద్ జీ మహంత్, అఖిల భారతీయ ప్రచార విభాగ్ ప్రభారీ లింగం సుధాకర్ రెడ్డి, అఖిల భారత కార్యవర్గ సభ్యులు లలిత్ బిహారీ గోస్వామి, అఖిల భారతీయ ప్రచార విభాగ్ సంయోజక్ రాం కుమార్, అభిలేఖా గార్ అఖిల భారతీయ సంయోజక్ రాజేంద్ర బాగేల్ పాల్గొన్నారు.

ముఖ్య వక్తగా విచ్చేసిన గోవింద్ జీ మహంత్ మాట్లాడుతూ విద్యా భారతి, శ్రీ సరస్వతీ శిశు మందిరాల ప్రస్థానం, ప్రచార విభాగ్ ఆవశ్యకత గురించి వివరించారు. 1952 నుండి విద్యా భారతి విద్య మరియు దేశ నిర్మాణం వంటి రంగాలలో నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఆధునిక సమాచార మాధ్యమాలను మరియు నిరంతరం అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను అందిపుచ్చుకుని, సంస్థ భావజాలాన్ని సమాజంలోని అన్ని వర్గాలకు చేరవేయడం నేటి తరుణంలో మన బాధ్యత అని అన్నారు. కేవలం పాఠశాలలను నిర్వహించడం మాత్రమే కాకుండా, “మాతృ దేవో భవ, పితృ దేవో భవ, దేశ దేవో భవ” (తల్లి, తండ్రి మరియు దేశాన్ని దైవ సమానంగా భావించడం) అనే స్ఫూర్తితో కూడిన దేశభక్తి గల పౌరులను తీర్చిదిద్దడమే విద్యా భారతి యొక్క లక్ష్యమని వివరించారు.

విద్యా భారతికి సంబంధించిన చరిత్ర, పాఠశాలల కేంద్రంగా చేస్తున్న కృషికి సంబంధించిన రికార్డులను భద్రపరచడం అత్యంత అవసరమన్నారు. దీని ద్వారా రాబోయే తరాలు వారి సంప్రదాయాన్ని, చరిత్రను తెలుసుకుంటాయని, అలాగే వాటితో మమేకమై , జీవించడానికి అవకాశం కలుగుతుందన్నారు. సత్యం మాత్రమే శాశ్వతమైందని, నిత్యమైందన్నారు.ఈ సత్యాన్ని, ఈ విజయాలను సమర్థవంతంగా సమాజానికి అందించడమే ప్రచార విభాగం బాధ్యత అని సూచించారు.

విద్యా భారతి అమృత్ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. అలాగే సంస్థ కార్యకలాపాలను ప్రజల్లోకి విస్తృతం చేసేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు.