News

విజ్ఞాన రంగంలో భారత్‌కు మరో గౌరవం.. హాకింగ్స్ సరసన భారత సైంటిస్ట్ దీపక్ ధర్‌

45views

భారతదేశపు ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, ఐఐఎన్‌ఎస్‌ఏ ప్రొఫెసర్ దీపక్ ధర్ అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు. భౌతిక శాస్త్ర రంగంలో అత్యున్నత పురస్కారాలలో ఒకటిగా భావించే 2026 డిరాక్ మెడల్‌ను ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్ (ఐసీటీపీ) ఆయనకు ప్రకటించింది. గతంలో స్టీఫెన్ హాకింగ్స్ వంటి దిగ్గజాలు అందుకున్న ఈ పురస్కారం, సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో విశేష కృషి చేసిన వారికి లభిస్తుంది. ఈ ఏడాది ఈ గౌరవం పొందిన నలుగురు శాస్త్రవేత్తలలో ప్రొఫెసర్ ధర్ ఒకరు.

అసంఖ్యాక కణాలతో కూడిన వ్యవస్థలు సమష్టిగా ఎలా ప్రవర్తిస్తాయో అధ్యయనం చేసే స్టాటిస్టికల్ మెకానిక్స్ రంగంలో ఆయన చేసిన విశేష కృషికి ఈ గౌరవం లభించింది. ఈ రంగం కేవలం సైద్ధాంతిక పరిశోధనలకే పరిమితం కాకుండా కృత్రిమ మేధ (ఏఐ), సంక్లిష్ట నెట్‌వర్క్‌లు, ఆర్థిక మార్కెట్ల విశ్లేషణలోనూ కీలకంగా మారుతోంది. ప్రొఫెసర్ ధర్ దశాబ్దాలుగా ఈ రంగంలో పనిచేస్తూ, బెంగళూరులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సైన్సెస్‌తో అనుబంధం కలిగి ఉన్నారు.

చిన్న పట్టణం నుంచి ప్రపంచ స్థాయికి
1951లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో జన్మించిన దీపక్ ధర్, హిందీ మీడియంలో విద్యాభ్యాసం చేశారు. ఆయన ఐఏఎస్ అధికారి కావాలని తల్లి ఆశించగా, తండ్రి మాత్రం సైన్స్ పత్రికలు తెచ్చిస్తూ ఆయనలో జిజ్ఞాసను పెంచారు. అలహాబాద్ యూనివర్సిటీ, ఐఐటీ కాన్పూర్‌లలో చదివిన తర్వాత ఆయన అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్‌టెక్)లో పీహెచ్‌డీ చేశారు. అక్కడ ఆయన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త రిచర్డ్ ఫైన్‌మన్‌ వద్ద శిష్యరికం చేశారు. ఫైన్‌మన్‌కు టీచింగ్ అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు.

అమెరికాలో ఉన్నత అవకాశాలు ఉన్నప్పటికీ, 1978లో పీహెచ్‌డీ తర్వాత భారత్‌కు తిరిగి రావాలని ధర్ నిర్ణయించుకున్నారు. ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్‌)లో చేరి నాలుగు దశాబ్దాలకు పైగా సేవలు అందించారు. అలాగే దాదాపు 8 ఏళ్ల పాటు ఐఐఎస్‌ఈఆర్ పూణెలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఈ క్రమంలోనే ఆయన ‘ధార్ బర్నింగ్ అల్గారిథం’ వంటి వినూత్న సిద్ధాంతాలను అభివృద్ధి చేశారు. ఇది కాంప్లెక్స్ సిస్టమ్స్ అధ్యయనంలో ఒక ముఖ్యమైన ఆవిష్కరణగా నిలిచింది.

అవార్డుల పరంపర
ప్రొఫెసర్ ధర్‌కు డిరాక్ మెడల్ రావడం ఆయన అందుకున్న గౌరవాల పరంపరలో తాజా మైలురాయి. 2022లో స్టాటిస్టికల్ ఫిజిక్స్‌లో అత్యున్నత పురస్కారమైన బోల్ట్జ్‌మన్ మెడల్ అందుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. “బోల్ట్జ్‌మన్ మెడల్ గెలిచిన తొలి భారతీయుడిని నేనే కావచ్చు. కానీ, ఈ రంగంలో గొప్ప కృషి చేసిన తొలి భారతీయుడిని మాత్రం కాదు” అని వినమ్రంగా చెప్పారు. 2023లో భారత ప్రభుత్వం ఆయనను దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌తో సత్కరించింది.

ఒక చిన్న పట్టణంలో సైన్స్ పత్రికలతో ఇంగ్లీష్ నేర్చుకున్న విద్యార్థి, ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త వద్ద చదువుకుని, విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉన్నా మాతృదేశానికి తిరిగి వచ్చి, భారత సైన్స్‌కు అపారమైన సేవలు అందించడం ఎందరికో స్ఫూర్తిదాయకం. దీపక్ ధర్‌కు లభించిన ఈ తాజా అంతర్జాతీయ గుర్తింపు, ఆయన కృషికి దక్కిన గౌరవంగానే కాకుండా పట్టుదల, అంకితభావం ఉంటే భారత గడ్డపై నుంచే ప్రపంచ స్థాయి విజయాలు సాధించవచ్చనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.