
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు సార్క్ దేశాలతో కలిసి భారత్ ముందడుగు వేయడం ఎంతో గొప్ప విషయమని అమెరికా ప్రశంసింది. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్ శుక్రవారం టెలిఫోన్ ద్వారా సంభాషించారు. ఇందులో భాగంగా ఇద్దరు నాయకులు కొవిడ్ మహమ్మారి గురించి చర్చించినట్లు ఆ దేశ రక్షణ విభాగం పెంటగాన్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘కరోనా విషయంలో పరస్పరం భాగస్వామ్యంతో కట్టడికి కృషి చేయాలని ఇరువురు నేతలు చర్చించారు. ద్వైపాక్షిక రక్షణ రంగ విషయాలు.. రాబోయే రోజుల్లో ప్రాంతీయ సహకారం, రక్షణాత్మక వాణిజ్యం, సైనిక సహకారం గురించి మాట్లాడారు. కొవిడ్ను నియంత్రించేందుకు దక్షిణ ఆసియా దేశాల(సార్క్) తరఫున నాయకత్వం వహించి భారత్ ముందడుగు వేయడాన్ని ఎస్పర్ ప్రశంసించారు. అవకాశం దొరికితే వీలైనంత తొందరలోనే ఎస్పర్ భారత పర్యటనకు రానున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో పర్యటన వాయిదా వేసుకున్నట్లు తెలిపారు’ అని పెంటగాన్ తెలిపింది. అమెరికాలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 13వేలకు చేరింది. కాగా మృతుల సంఖ్య 230కు పెరిగింది.





