News

టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు: నిందితురాలు నిదా ఖాన్‌కు బెయిల్ మంజూరు!

31views

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అనుబంధ బీపీవో యూనిట్‌లో జరిగిన మతమార్పిడి, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితురాలైన నిదాఖాన్‌కు నాసిక్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.. నాసిక్ రోడ్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి కె.జి.జోషి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. నిదా ఖాన్‌తో పాటు ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న తౌసిఫ్ అత్తార్‌కు కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే, ఇదే కేసులో ఉన్న మరో కీలక నిందితుడు డానిష్ షేక్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను మాత్రం న్యాయస్థానం తీవ్రంగా తిరస్కరించింది.

టీసీఎస్ నాసిక్ బీపీవో యూనిట్‌లో టెలికాలర్‌గా పనిచేసిన నిదాఖాన్, ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత దాదాపు 42 రోజుల పాటు పోలీసులకు దొరకకుండా పరారయ్యారు. అనంతరం మే నెలలో ఛత్రపతి శంభాజీనగర్‌లో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

తాను ప్రస్తుతం గర్భవతిగా ఉన్నానని, జైలులో ఇబ్బందులు పడుతున్నానని పేర్కొంటూ వైద్య కారణాల రీత్యా ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బాధితురాలికి నిదాఖాన్ బురఖా, ఇస్లామిక్ మతపరమైన పుస్తకాలను ఇవ్వడంతో పాటు, ఫోన్‌లో మతపరమైన యాప్స్ ఇన్‌స్టాల్ చేసి మతమార్పిడికి ప్రేరేపించిందని, వాట్సాప్ గ్రూపుల ద్వారా ఒత్తిడి తెచ్చిందని పోలీసులు ఆరోపించారు. చార్జ్‌షీట్ దాఖలు కావడం, ఆమె గర్భం దాల్చిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుని కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

మరోవైపు, డానిష్ షేక్ చేసిన నేరం తీవ్రమైనదని కోర్టు స్పష్టం చేసింది. బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అప్పటికే వివాహమైన విషయాన్ని దాచిపెట్టి లైంగిక దోపిడీకి పాల్పడ్డాడని న్యాయస్థానం పేర్కొంది. బాధితురాలు షెడ్యూల్డ్ కులానికి (ఎస్‌సీ) చెందినదని తెలిసి కూడా మతమార్పిడికి బలవంతం చేశాడని, అందువల్ల సాక్షులను బెదిరించే అవకాశం ఉన్నందున అతడికి బెయిల్ ఇవ్వలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

ఈ వ్యవహారంలో పలువురు మహిళా ఉద్యోగులు లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ఆరోపణలు చేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి విచారణ జరుపుతోంది. దీనిపై స్పందించిన టీసీఎస్ యాజమాన్యం.. నిందితులైన ఉద్యోగులను ఇప్పటికే సస్పెండ్ చేశామని, ఇలాంటి ప్రవర్తనపై తాము కఠినంగా ఉంటామని స్పష్టం చేసింది.