
దేశంలో మోసపూరిత, బలవంతపు మతమార్పిళ్లను నిరోధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. నాసిక్లోని ఓ బహుళజాతి కంపెనీలో బలవంతపు మార్పిళ్లు, లైంగిక వేధింపులు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ పిటిషన్ వేశారు. మోసపూరిత మతమార్పిళ్లు దేశ సార్వభౌమత్వానికి, లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికి, వ్యక్తి స్వేచ్ఛకు మాత్రమే కాకుండా సోదరభావానికీ, జాతీయ సమైక్యతకూ ప్రమాదకరమని పేర్కొన్నారు. సమస్యను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకునేలా కేంద్రం, రాష్ట్రాలను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసుల సత్వర విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన మత స్వేచ్ఛను ఇతరులను మోసపూరితంగా, భయపెట్టి మతం మారేలా చేయడానికి దుర్వినియోగపరచకుండా చూడాలన్నారు. మతమార్పిళ్ల సమస్యకు సంబంధించి అశ్వినీ ఉపాధ్యాయ్ గతంలో వేసిన పిటిషన్కు అనుబంధంగా తాజా పిటిషన్ వేశారు. తొలి పిటిషన్పై 2023లో విచారణ సందర్భంగా…మతమార్పిళ్లు తీవ్ర సమస్యేనని, దీనికి రాజకీయ రంగు ఆపాదించరాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేసు విచారణలో అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సహాయాన్ని కోరింది.





