
బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే రూ.1.50 లక్షలు దాటిన బంగారం ధర, రెండు లక్షలకు ఏ క్షణమైన చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే బంగారం ధరలు దేశ వ్యాప్తంగా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, దొంగతనాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. చైన్ స్నాచింగ్, జువెలరీ షాపులలో అర్ధరాత్రి దొంగతనాలు, గన్స్ పెట్టి బెదిరించి మరీ బంగారం దొంగతనం చేస్తున్న సంఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా ఓ లేడీ బురఖా ధరించి, బంగారం దొంగతనం చేసింది. ఎదిరించిన ఓనర్ ను గన్ పట్టుకొని మరి బెదిరించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
బురఖా వేసుకొని మరీ దొంగతనం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య జిల్లా రుదౌలీ పట్టణంలో అగర్వాల్ కాంప్లెక్స్ చాలా ఫేమస్. ఇందులో చాలా జ్యువెలరీ దుకాణాలు ఉన్నాయి. అయితే ఇక ఈ కాంప్లెక్స్ లోని ఓ జువెలరీ దుకాణంలో గురువారం సుమారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో దొంగతనం జరిగింది. బురఖా ధరించి, కస్టమర్ లాగా ఓ మహిళ జ్యువలరీ షాప్ లోకి వచ్చింది. అదే సమయంలో 26 గ్రాముల బంగారు నెక్లెస్ దుకాణపు ఓనర్ సిద్ధం చేశారు.
ముందుగా ఓనర్ తో మాట్లాడే ప్రయత్నం చేసిన ఆ బురఖా లేడీ, సెకండ్ల వ్యవధిలోనే ఆ నెక్లెస్ లాగేసుకుంది. ఈ తరుణంలో యజమాని ఎదురు తిరగగా, అతనికి పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టింది. ఆ తర్వాత అక్కడ నుంచి మెల్లిగా జారుకుంది బురఖా లేడీ. దీంతో యజమాని లబోదిబోమంటున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న రుదౌలీ పోలీసులు.. ఆ లేడీ కోసం గాలిస్తున్నారు.





