
ఆరెస్సెస్ కార్యకర్త నవీన్ అరోరా హత్య విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పంజాబ్ పోలీసులు ఫాజిల్కాలోని శ్మశానవాటిక దగ్గర జరిగిన భీకర ఎన్ కౌంటర్ లో కీలక నిందితుడు బాదల్ హతమయ్యాడు. లాలాబాద్ లో ఉదయం పోలీసులకు, నేరస్థులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సమయంలోనే ఆరెస్సెస్ కార్యకర్త నవీన్ అరోరా హత్య కేసులో ప్రధాన నిందితుడు బాదల్ హతమయ్యాడు.ఈ సమయంలో ఓ పోలీసు కూడా గాయపడ్డాడు.
అరోరా హత్యకు సంబంధించిన ఆయుధాలను స్వాధీనం చేసుకోవడానికి CIA విభాగం, DSP సిటీ మరియు DSP డిటెక్టివ్ అధికారులతో సహా ఒక ప్రత్యేక పోలీసు బృందం బాదల్ను మాము జోయా గ్రామానికి తీసుకెళ్లినప్పుడు ఎన్కౌంటర్ జరిగింది.
అయితే.. పోలీసులు దర్యాప్తులో భాగంగా శ్మశాన వాటిక దగ్గరికి చేరుకోగానే.. ఇద్దరు నేరస్థులు అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. ఆ తరువాత జరిగిన కాల్పుల్లో పోలీసు కస్టడీలో వున్న ప్రధాన నిందితుడు మరణించాడు.
ఈ విషయంలో, ఫిరోజ్పూర్ రేంజ్ డిఐజి హర్మన్బీర్ సింగ్ గిల్ మాట్లాడుతూ, నవంబర్ 15, 2025న, ఫిరోజ్పూర్ నగరంలోని మార్కెట్లో ఆర్ఎస్ఎస్ నాయకుడి కుమారుడు నవీన్ అరోరాను కాల్చి చంపారని అన్నారు.హత్య జరిగిన వెంటనే, పోలీసులు ముగ్గురు నిందితులు కాళి, హర్ష్ మరియు కనవ్లను అరెస్టు చేశారు. కాళి అరెస్టు సమయంలో కూడా కాల్పులు జరిగాయి.
పోలీసులు ఈ కేసులో ప్రధాన షూటర్, ఫిరోజ్పూర్ నివాసి బాదల్ను అరెస్టు చేయగా, విచారణలో హత్యకు ఉపయోగించిన ఆయుధాలను జలాలాబాద్లోని మహమూజియా శ్మశానవాటికలో దాచిపెట్టినట్లు చెప్పాడు. అందుకే పోలీసులు శ్మశాన వాటికకు వెళ్లారు. అంతలోనే నేరస్థులు బాదల్ పై కాల్పులు జరిపారు.
అసలు ఏం జరిగిందంటే…
పంజాబ్లో దారుణం జరిగింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యకర్త నవీన్ అరోరా (40) ని గుర్తు తెలియని వ్యక్తులు ఫిరోజ్పూర్లో కాల్చి చంపారు. తన దుకాణాన్ని మూసేసి, ఇంటికి తిరిగి వెళ్తుండగా… బుధ్వారావాలా మొహల్లా సమీపంలో దుండగులు అతనిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారని కూడా తెలిపారు.
“నవీన్ ఇంటికి వెళ్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. మా బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది మరియు మేము సిసిటివి ఫుటేజ్ను స్కాన్ చేస్తున్నాము” అని ఫిరోజ్పూర్ ఎస్ఎస్పి భూపిందర్ సింగ్ సిద్దూ ప్రకటించారు.
“మేమందరం కూర్చుని మాట్లాడుకుంటున్నాం. నవీన్ ప్రతిరోజూ బయటకు వెళ్లి తన పిల్లలతో గడపడానికి తిరిగి వస్తాడు. అతను వెళ్లిన ఐదు నిమిషాలకే, నా కొడుకును ఎవరో కాల్చి చంపారని మాకు సమాచారం అందించడానికి ఇద్దరు అబ్బాయిలు పరుగెత్తుకొచ్చారు” అని అతని తండ్రి బల్దేవ్ అరోరా వాపోయారు.
ఇక.. కాల్పులు జరిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులు పారిపోయినట్లు సీసీ టీవీలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వారిని గుర్తించడానికి పోలీసు బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని జిల్లా ఏఎస్పీ ప్రకటించారు.
నవీన్ అరోరా ఇంట్లో మూడు తరాలుగా సంఘ స్వయంసేవకత్వం కొనసాగుతూ వస్తోంది. నవీన్ తాత దీనానాథ్ ఫిరోజ్ పూర్ సంఘచాలక్గా పనిచేశారు. ఆ తర్వాత నవీన్ తండ్రి కూడా స్వయంసేవక్. నవీన్ కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా వున్నారు.





