
ఈజిప్ట్ ‘‘షర్మ్ ఎల్ షేక్’’లో గాజా శాంతి ఒప్పందంపై ఇజ్రాయిల్, హమాస్ సంతకాలు చేశాయి. దీనికి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు పలు దేశాధినేతలు హాజరయ్యారు. అయితే అన్నింటి కన్నా ఎక్కువగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ట్రంప్ను పొగుడుతున్న వీడియో తెగ వైరల్ అయింది. అమెరికా అధ్యక్షుడిని ‘‘శాంతి దూత’’ అని షరీఫ్ ప్రశంసించారు. భారత్-పాకిస్తాన్ యుద్ధం ఆపినందుకు ట్రంప్కు పాకిస్తాన్ ప్రధాని థాంక్స్ తెలిపారు. దక్షిణాసియాతో పాటు మధ్యప్రాచ్యంలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడినందుకు ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి మరోసారి నామినేట్ చేస్తానని చెప్పారు. ట్రంప్ చిరునవ్వుతో స్పందిస్తూ.. వావ్ నేను దీనిని ఊహించలేదు అని అన్నారు.
ఇదిలా ఉంటే, షరీఫ్ ట్రంప్ను ప్రశంసించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన ప్రసంగాన్ని పాకిస్తానీయులకు అవమానంగా అభివర్ణించారు. పాకిస్తాన్ రాజకీయ నాయకుడు, చరిత్రకారుడు అమ్మర్ అలీ జాన్ ఎక్స్లో..‘‘ షరీఫ్ డొనాల్డ్ ట్రంప్ను నిరంతరం పొగడటం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాకిస్తానీయులకు ఇబ్బందికరం’’ అని అన్నారు.
‘‘ట్రంప్ తన బూట్లను ఇంతకు ముందు కన్నా ఎప్పుడూ లేని విధంగా మెరిసిపోవాలని అనుకున్నప్పుడల్లా పాక్ ప్రధానిని ఆహ్వానిస్తారు. ’’ అని కాలమిస్ట్ ఎస్ఎల్ కాంతన్ ఎక్స్లో రాశారు. షరీఫ్ ప్రవర్తన పాకిస్తాన్లోని 24 కోట్ల మందికి అవమానం అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘షరీఫ్ గతంలో కూడా ట్రంప్ను పొగిడాడు. అంతర్జాతీయ మీడియా ముందు ఇదే మాటలు చెప్పాడు. ఈ కీలు బొమ్మలు పాకిస్తాన్ను బిలియిన్ డాలర్లకు అమ్మేశారు’’ అని ఒక యూజర్ రాసుకొచ్చారు.





