
“ఆపరేషన్ సిందూర్” అనే థీమ్తో కోల్కతాలోని సంతోష్ మిత్రా స్క్వేర్లో దుర్గా పూజ మండపాన్ని సెప్టెంబర్ 26న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ ఏడాది ఏప్రిల్లో జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన సరిహద్దు వైమానిక దాడులను ఈ మండపం గుర్తు చేస్తుంది. అయితే.. తాజాగా పోలీసులు ఈ మండపాన్ని తొలగించాలని ఒత్తిడి చేస్తున్నట్లు నిర్వహకులు చెబుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం…
ఈ పూజ పండల్ ప్రారంభోత్సవం జరిగిన ఒక రోజు తర్వాత.. బీజేపీ కౌన్సిలర్, పూజా కమిటీ కార్యదర్శి సజల్ ఘోష్ కోల్కతా పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. “గత మూడు సంవత్సరాల మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రికార్డు స్థాయిలో భక్తులు వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకుంటున్నారు. కానీ కోల్కతా పోలీసులు ఈ మండపాన్ని మూసివేయడానికి కుట్ర పన్నుతున్నారు. మమ్మల్ని వేధిస్తున్నారు. పోలీసులు రోడ్డు మధ్యలో బారికేడ్లు వేసి, జనసమూహాన్ని మళ్లిస్తున్నారు. మా పూజ మండపంలోకి ప్రజలు ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు. మా ఆపరేషన్ సిందూర్ థీమ్ కొంతమందికి తలనొప్పిగా మారింది. అందువల్ల, రాజకీయ ప్రతీకార చర్యగా ఈ మండపాన్ని మూసివేయడానికి అధికార పార్టీ పోలీసులను ఒక సాధనంగా ఉపయోగిస్తోంది.” అని సజల్ ఘోష్ అన్నారు. ఈ అంశంపై స్థానిక ప్రజలు సైతం మండిపడుతున్నారు. శత్రుదేశమైన పాకిస్థాన్ను లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్ సిందూర్ను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇది భారతదేశం పాకిస్థాన్ కాదు అంటూ మండిపడుతున్నారు.





