News

మన్యం వాసికి జాతీయ అవార్డు

138views

భూగోళ పరిశోధనల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గిరిజన బిడ్డకు ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం ఖరాసవలస పంచాయతీ పరిధి కొమ్మవానివలసకు చెందిన సంగంరెడ్డి శ్యామ్‌కుమార్‌ జాతీయ భూగోళశాస్త్ర లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డు (2024-2025)కు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి భవన్‌ సెంట్రల్‌ హాల్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఈ అవార్డును అందుకున్నారు.

కొమ్మవానివలసలో సాధారణ గిరిజన కుటుంబంలో జన్మించిన శ్యామ్‌కుమార్‌ ఏయూలో భూగోళశాస్త్రంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం అక్కడే జియాలజిస్ట్‌గా కొలువు సాధించారు. ప్రస్తుతం ఆయన సీనియర్‌ జియాలజిస్ట్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలో కాపర్‌, నికెల్‌, కోబాల్ట్‌,గోల్డ్‌ వంటి వ్యూహాత్మక, కీలకమైన ఖనిజ ఆవిష్కరణ అన్వేషణలో ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో 2024-2025 ఏడాదిగాను ఈ అవార్డ్‌కు ఎంపికయ్యారు. భారత భూగోళ పరిశోధన సంస్థ ( జీఎస్‌ఐ ) మినిస్ట్రీ ఆఫ్‌ మైన్స్‌ భూగోళ శాస్త్రవేత్తలకు అందించే ఈ అవార్డుకు మన్యం వాసి ఎంపికవడంపై ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.