
ఆప్ఘనిస్థాన్ లో జరిగిన సాయుధ బలగాల దాడిలో కరడుకట్టిన తాలిబన్ కమాండర్ క్వారీ సైఫుల్లా మెహసూద్ హతమయ్యాడు. ఇక్కడి ఖోస్త్ ప్రావిన్స్లోని గులూన్ స్థావరం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక వేర్పాటువాద గ్రూపు హక్కానీ నెట్వర్క్ ఈ దాడి చేసినట్టుగా భావిస్తున్నారు. ఈ ఘటనలో తెహ్రిక్-ఇ-తాలిబన్- పాకిస్థాన్ (టీటీపీ)కి చెందిన సైఫుల్లాతో సహా ముగ్గురు సభ్యులు మృతిచెందినట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు.
2015లో 45 మందిని పొట్టన పెట్టుకున్న కరాచీ బస్ దాడిలో మెహసూద్ నిందితుడు. ఈ సంవత్సరం ఖైబర్ పంక్తుంఖ్వా ప్రాంతంలోని ఉత్తర, దక్షణ వజీరిస్తాన్ జిల్లాల్లో 75 తీవ్రదాడులకు పాల్పడ్డామని ఇటీవల మెహసూద్ స్వయంగా ప్రకటించాడు. అనేక ఉగ్ర దాడుల్లో హస్తమున్న సైఫుల్లా మెహసూద్ కోసం పాక్ ప్రభుత్వం తీవ్రంగా గాలిస్తోంది. కాగా అతన్ని 2016లో అమెరికా దళాలు ఆప్ఘనిస్థాన్ లో అదుపులోకి తీసుకున్నాయి. 14 నెలల పాటు కారాగారంలో ఉన్న అనంతరం మెహసూద్ విడుదలయ్యాడు.
2007లో బైతుల్లా మెహసూద్ స్థాపించిన టీటీపీ ఆ తరువాత స్వాట్, మెహసూద్, బజౌర్ ఏజన్సీ, దారా అదంఖేల్ అనే నాలుగు వర్గాలుగా విడిపోయింది. ఈ నాలుగు వర్గాలను తిరిగి సంఘటితం చేయటానికి ప్రయత్నిస్తున్న క్వారీ సైఫుల్లా మెహసూద్ మృతి టీటీపీకి పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





