ArticlesNews

స్థపతి స్థాపత్య వేదం

222views

‘దేవాలయం వినాయత్ర ఏకకాలం నవాసయేత్‌’… దేవాలయం లేని చోట ఒక్క క్షణం కూడా ఉండకూడదని ‘కారణాగమం’ చెబుతోంది. కాబట్టి అలాంటి ఆలయాలను, అందులోని విగ్రహాలను నిర్మించడానికి సాక్షాత్తూ భగవంతుడే మహర్షులకు శిల్పశాస్త్రాన్ని ఉపదేశించాడు. కాగా పరమశివుడు కాశ్యపునికి శిల్పశాస్త్రాన్ని ఉపదేశించాడని ‘కాశ్యప శిల్పశాస్త్రం’ చెబుతోంది. ఈ శిల్పశాస్త్రాలను కలిపి ‘స్థాపత్యవేదం’ అని అంటారు. ఆలయాల నిర్మాణం గురించి తెలిపిన ఆ భగవంతుడే ఆలయాలలోని అర్చనా విధానాలను, ఉత్సవ విధానాలను తెలిపే ఆగమశాస్త్రాలను అనుగ్రహించాడు. పరమేశ్వరునిద్వారా శివాగమాలు, మహావిష్ణువు ద్వారా వైష్ణవాగమాలు, శక్తినుంచి శాక్త్యాగమాల బోధన జరిగింది. ఈ స్థాపత్య వేదాన్ని అభ్యసించినవారినే ‘స్థపతి’ అంటారు.

నలుగురు ముఖ్యులు…
దేవాలయాలను శిల్ప శాస్త్ర ప్రకారంగా స్థపతి ద్వారా నిర్మించాలి. ప్రజలందరూ పూజించే దేవుని విగ్రహాలు, ఆలయాలతో పాటు గ్రామాలను, నగరాలను కోటలను… వీటన్నిటినీ నిర్మించడానికి విశ్వకర్మ జన్మించాడు. సృష్టి ప్రారంభం నుంచి నేటిదాకా ప్రతి నిర్మాణానికి విశ్వకర్మ ఆశీస్సులు ఉన్నాయి. ఇంద్రుని అమరావతి పట్టణం, శ్రీకృష్ణుని ద్వారకాపట్టణం లాంటివి ఎన్నో ఆయన సృష్టించాడు. ఆయనకు మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ అనే అయిదుగురు కుమారులు ఉన్నారు. కమ్మరం (ఇనుప పని), వడ్రంగం, లోహపు పని (కంచరం), శిల్పం ( శిలా విగ్రహాలు నిర్మించడం), స్వర్ణం (బంగారు ఆభరణాలు తయారు చేసే పని) అనే అయిదు పనులను వారికి ఆయన అప్పగించాడు. వారిలో నాలుగో కుమారుడైన శిల్పికి శిలావృత్తిని అప్పగించి… ప్రపంచంలో సుందరమైన ఆలయాలను, విగ్రహాలను నిర్మించడం ద్వారా ప్రజలను భక్తిభావం వైపు నడిపించాలని ఆదేశించాడు. ఈ శిల్పులలో నాలుగు రకాలైనవారు ఉన్నారు. వారు స్థపతి, వర్ధకి, తక్షకుడు, సూత్రగ్రాహి.

స్థపతి: స్థపతి అంటే ‘స్థాపన చేయడంలో నేర్పరి ’ అని అర్థం. అతను సర్వ శాస్త్ర విశారదుడిగా, వేదాధ్యాయన పరుడిగా ఉండాలని, అన్ని శిల్ప శాస్త్రాలను ఆపోశన పట్టి ఉండాలని, వాస్తు విద్యా సముద్రాన్ని ఆకళింపు చేసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా అతను వాస్తు, జ్యోతిషం, తత్త్వశాస్త్రం, ఖగోళ శాస్త్రం తదితర 64 కళలలో ప్రవీణుడై ఉండాలని, తన వృత్తి పట్ల మిక్కిలి శ్రద్ధ కలిగి, శీలవంతుడై, ఇతరుల పట్ల ద్వేషభావం, అసూయ లేకుండా ధార్మికబుద్ధి కలిగినవాడై ఉండాలని‘ విశ్వకర్మీయం’ అనే ప్రాచీన శిల్ప శాస్త్ర గ్రంథం స్పష్టం చేసింది.

వర్ధకి: ఇతను స్థపతి కుమారుడు కానీ, శిష్యుడు కానీ అయి ఉండాలి. శాంతచిత్తుడై, యంత్రకళలో ప్రవీణుడై ఉండాలి. విగ్రహ నైపుణ్యాన్ని వృద్ధి చేసేవాడు కనుక ‘వర్ధకి’ అని పిలుస్తారు.

తక్షకుడు: ఇతను చెక్కడంలో నేర్పరి. స్థపతి చెప్పిన పనులను తు.చ. తప్పకుండా నెరవేర్చేవాడు. ఇతనికి రేఖాశాస్త్రంలో నేర్పు ఉండాలి.

సూత్రగ్రాహి: ఇతను సూత్రాలతో విగ్రహాల కొలతలు నిర్ణయించేవాడు. ఇతను కూడా స్థపతి ఆజ్ఞాబద్ధుడే. ఇతను గణితంలో ప్రవీణుడై ఉండాలి.

ఇలా నాలుగురకాలైన వీరిని ‘విశ్వకర్మలు’ అని పిలుస్తారని ‘మయమతం’ చెబుతోంది. వీరు లేకుండా దేవాలయ నిర్మాణం కానీ, మరే ఇతర పుణ్యకార్యం కానీ జరగదు.