
రక్షా బంధన్ పండుగను ఈ శనివారం(ఆగస్టు 9) దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమను ప్రతిబింబించే ఈ పండుగ సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా దేశంలోని అనేక మంది ప్రముఖులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నాగ్పూర్లో రాష్ట్రీయ స్వయం సేవక సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్కు పలువురు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
రక్షా బంధన్ సందర్భంగా, నాగ్పూర్లోని రాష్ట్రీయ స్వయంసేవక- సంఘ్ RSS ప్రధాన కార్యాలయంలో ప్రాంతీయ టిబెటన్ మహిళా సంఘం, భారత్ టిబెట్ సహకార వేదిక సోదరీమణులు RSS చీఫ్ మోహన్ భగవత్కు రాఖీ కట్టారు. ఆయనకు ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ సేవిక సమితి సోదరీమణులు, మహల్ ప్రాంగణ నివాసితులు ఆయనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా, ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ కు, ఆర్ఎస్ఎస్ లోని అనేక మంది ముఖ్యులకు భారత్ టిబెట్ సహయోగ్ ఉద్యమ మహిళా కార్యకర్తలు రాఖీలు కడుతున్నారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ మహిళలకు స్వీట్లు బహుకరించారు.
అంతకుముందు, ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధానమంత్రి నివాసంలో రక్షా బంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాఖీ కట్టి, ఆయనకు దీర్ఘాయుష్షును ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ సమయంలో, ప్రధానమంత్రి మోదీ కూడా విద్యార్థులందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించి, వారితో సమయం గడిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘X’లో ఒక పోస్ట్ ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘రక్షా బంధన్ సందర్భంగా దేశవాసులందరికీ శుభాకాంక్షలు’ అని ఆయన రాశారు.





