
భారతదేశ సంపద వేదాలని, ఇవి అతిప్రాచీన విజ్ఞాన సంపదలని పలువురు వేదపండితులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సరిపల్లె సత్యాభివర్థక నిలయంలోని టీటీడీ కల్యాణ మండపంలో 105వ వేదశాస్త్ర పరిషత్ కార్యక్రమాలు గురువారం వేదమంత్రాల ఘోషతో ప్రారంభమయ్యాయి. మూడురోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో దేశ నలుమూలల నుంచి వేద విద్యార్థులు వేద పరీక్షల్లో పాల్గొంటున్నారు.
తొలిరోజు జరిగిన పరీక్షలు పరీక్షాధికారుల ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఆఖరి రోజు 9వ తేదీన వేదశాస్త్ర సభ నిర్వహించారు. వేద పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు టీటీడీ వారు జారీ చేసిన యోగ్యతాపత్రాలు అందజేస్తారు. ఈ కార్యక్రమం స్థానిక గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో గత 31 ఏళ్ల నుంచి టీటీడీ వారి సహకారంతో భోజన, వసతి తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ పరీక్షల్లో పాల్గొనేందుకు టీటీడీ ఎస్వీ యూనివర్సిటీ నుంచి రాజస్థాన్, బిహార్, మహారాష్ట్ర, తమిళనాడు, కంచి, కర్ణాటక, తెలంగాణ ఉభయరాష్ర్టాల నుంచి విద్యార్థులు పరీక్షల్లో పాల్గొన్నారు. దేశంలోని 48 వేదపాఠశాలల్లో సరిపల్లెలోని వేదపాఠశాలకు ప్రథమ స్థానం దక్కింది. 150 మంది వేదవిద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొంటున్నారు. నిత్యం వేదమంత్రాల ఘోషతో భగవన్నామస్మరణతో, హోమాలు, నిత్యాన్నదానాలతో పునీతమయ్యే పవిత్రభూమి ఈ సరిపల్లె గ్రామంలోని సంఖ్యార్థివర్థక నిలయంలో గత 105 ఏళ్ల నుంచి ఇక్కడకు ప్రతీఏటా వస్తున్న వేదపండితులు వారి మనోభావాలు వివరించారు.





