News

“ఉదయ్‌పూర్ ఫైల్స్ – కన్హయ్య లాల్ టైలర్ మర్డర్” సినిమాపై స్టే కుదరదు : సుప్రీంకోర్టు..

410views

2022లో నూపుర్ శర్మ ‘‘మహ్మద్ ప్రవక్త’’పై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో సమర్థించిన కారణంగా, ఉదయ్‌పూర్‌కు చెందిన దర్జీ కన్హయ్యలాల్‌ని ఇద్దరు మతోన్మాదులు మహ్మద్ రియాజ్, మహ్మద్ గౌస్ హత్య చేశారు. ఆయన షాప్‌లోనే శరీరం నుంచి తలను వేరు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కథాంశం ఆధారంగా నిర్మించిన “ఉదయ్‌పూర్ ఫైల్స్ – కన్హయ్య లాల్ టైలర్ మర్డర్” సినిమాకు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి.

అయితే, ఈ సినిమా రిలీజ్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విడుదలకు కేంద్రం అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లనున జూలై 28న విచారించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. జూలై 21న కేంద్రం సినిమా విడుదలకు అనుమతినిస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. కేంద్రం ఉత్తర్వులను సవాల్ చేయడాని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లను ఆదేశించింది. కేంద్రం ఉత్తర్వులతో చిత్ర నిర్మాత సంతృప్తిగా ఉన్నాడని, సుప్రీంలో కేసు కొనసాగించేందుకు ఇష్టపడటం లేదని, కాబట్టి మీరు హైకోర్టుకు వెళ్లాలని, మా సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది.

నిజానికి జూలై 11, 2025లోనే సినిమా విడుదల కావాల్సి ఉంది. విడుదలను అడ్డుకోవాలని జమియత్ ఉలేమా ఇ హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ తరుఫున కబిల్ సిబల్, నిందితుల్లో ఒకరి నుంచి వాదిస్తున్న గురుస్వామిలు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పుడు వీరందర్ని హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. అందకుముందు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసి, సినిమాలో కొన్ని సవరణలు, మార్పులను సూచించింది.

హైకోర్టు ఈ కేసును టేకప్ చేసే వరకు స్టే జారీ చేయాలని పిటిషనర్ల తరుపు న్యాయవాదులు కోరినప్పటికీ సుప్రీంకోర్టు ఇందులో కలుగజేసుకునేందుకు ఒప్పుకోలేదు. మరోవైపు, చిత్ర నిర్మాతలు కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్ రిలీజ్ అయినప్పుడు సమాజంలో ఎలాంటి అశాంతి చెలరేగలేదనే విషయాన్ని కోర్టు ముందుకు తెచ్చారు. చిన్న విషయాన్ని వారు పెద్దగా చూపిస్తున్నారని కోర్టుకు తెలిపారు.