
వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన పోర్టల్, డేటాబేస్ నిర్వహణ, ఆస్తుల గణాంకాల నమోదు, వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానం, ఆడిట్ నిర్వహణను నిర్దేశించే నియమాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏకీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారికత, సామర్థ్య పెంపుదల, అభివృద్ధి నియమాలు – 2025 అనే పేరుతో రూపొందించిన ఈ నిబంధనల్ని నోటిఫై చేసింది. వక్ఫ్ సవరణ చట్టం 2025 ఆధారంగా రూపొందించిన సెక్షన్ 108బి నిబంధన కింద ఈ నియమాలను రూపొందించారు. ఈ నియమాల ప్రకారం వక్ప్ వివరాలను నమోదు చేసేందుకు ఒక పోర్టల్ను, డేటాబేస్ను ఏర్పాటు చేస్తారు. వక్ఫ్ ఆస్తుల వివరాలను ఇందులో అప్లోడ్ చేస్తారు. 1995 నాటి వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 48 కింద ఔకాఫ్ నిర్వహణ రిజిస్టరును, సంబంధిత వక్ఫ్ ముతవల్లి సమర్పించిన లెక్కలను కూడా పోర్టల్లో పొందుపరుస్తారు. కేంద్ర మైనారిటీల శాఖలో వక్ఫ్ విభాగానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న సంయుక్త కార్యదర్శి ఈ పోర్టల్ పర్యవేక్షణ, నియంత్రణలకు బాధ్యత వహిస్తారని నోటిఫై చేసిన నిబంధనలు పేర్కొంటున్నాయి.





