
మత విశ్వాసాలకు సంబంధించిన అంశంలో భారత్ ఎవరి పక్షానా నిలబడదని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టంచేసింది. దేశంలో ప్రతి ఒక్కరి మత స్వేచ్ఛను ప్రభుత్వం ఎల్లప్పుడూ సమర్థిస్తుందని, అలాగే కొనసాగిస్తుందని విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వెల్లడించారు. ‘‘తన వారసత్వం కొనసాగుతుందని దలైలామా ప్రకటించిన వార్తలను మనం చూశాం. మతం, విశ్వాసానికి సంబంధించిన అంశాల్లో భారత ప్రభుత్వం ఎవరి పక్షానా నిలబడదు’’ అని జైశ్వాల్ ప్రకటించారు.
వారసుడి ఎంపికపై నిర్ణయం తీసుకునే హక్కు టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకే ఉందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలపై చైనా తీవ్రంగా స్పందించింది. టిబెట్కు సంబంధించిన విషయాల్లో భారత్ జోక్యం తగదని, ఇది తమ అంతర్గత వ్యవహారమని తెలిపింది. ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతినకుండా తన మాటల్లో, చేతల్లో భారత్ జాగ్రత్త వహించాలని కోరింది.





