
హనుమాన్ స్ఫూర్తిగా ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాకిస్థాన్తో పాటు ప్రపంచానికి మనం బలమేంటో చూపించామన్నారు. పాక్ ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేశాం తప్ప.. పౌరులను కాదని చెప్పారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా హైదరాబాద్లోని శిల్పకళావేదికలో క్షత్రియ సేవా సమితి (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్), భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో రాజ్నాథ్ మాట్లాడారు.
గిరిజనుల కోసం అల్లూరి సీతారామరాజు అనేక పోరాటాలు చేశారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గెరిల్లా యుద్ధ నైపుణ్యాలతో బ్రిటిష్ వారితో ఆయన పోరాడారని గుర్తుచేశారు. ‘‘భారత్ కోసం అల్లూరి సీతారామరాజు లాంటి గొప్ప వీరుడిని ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది. అడవి నుంచి విప్లవం పుట్టించి బ్రిటిష్ వారిని గజగజలాడించిన వ్యక్తి అల్లూరి. గెరిల్లా యుద్ధ నైపుణ్యాలతో ఆధునిక ఆయుధాలకు వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి ఆయన. బానిసత్వంతో కాదు ఆత్మాభిమానంతో బతకాలనేది ఆయన నుంచి మనం నేర్చుకోవాలి. అడవి బిడ్డల కోసం అల్లూరి వీరోచిత పోరాటం చేశారు. ఆయన పుట్టిన గ్రామాన్ని పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నాం’’ అని రాజ్నాథ్ అన్నారు





