News

కాశీ ఆలయంలోని నిషేధిత ప్రాంతంలో తేజ్ ప్రతాప్ వీడియో.. దర్యాప్తునకు ఆదేశం

272views

బీహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో నిషేధిత ‘రెడ్ జోన్’ లోపల ఫొటోలు తీసుకున్నారు. అక్కడి భద్రతా సిబ్బందితో కలిసి వీడియోలు రికార్డ్‌ చేశారు. వీటిని సోషల్‌ మీడియాలో ఆయన పోస్ట్‌ చేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మొబైల్ ఫోన్‌లు అనుమతించని కాశీ విశ్వనాథ్ ఆలయంలోని నిషేధిత ‘రెడ్ జోన్’ లోపల తేజ్ ప్రతాప్ యాదవ్ ఫొటోలు తీసుకోవడం, వీడియోలు రికార్డ్‌ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

కాగా, కాశీ విశ్వనాథ్ ఆలయ పరిపాలనా యంత్రాంగం దీనిపై స్పందించింది. ఆలయ భద్రతకు బాధ్యత వహించే సీఆర్పీఎఫ్‌, స్థానిక పోలీసులకు ఈ సమాచారం ఇచ్చినట్లు కాశీ విశ్వనాథ్ ఆలయ సీఈవో విశ్వ భూషణ్ మిశ్రా తెలిపారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరుపాలని, బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.