
ఎన్టీఆర్ జిల్లాలో గోవధ నిషేధ చట్టాన్ని సమర్ధవంతంగా అమలుచేయాలని చట్టాన్ని ఉల్లంఘింస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ స్పష్టంచేశారు. గోవధ నిషేధ చట్టం అమలుపై సమన్వయ శాఖల అధికారులతో విజయవాడలోని జిల్లా కలెక్టర్ ఆయన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గోవధ నిషేధ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయడం అధికారుల బాధ్యత అన్నారు. బక్రీద్ సందర్బంగా జిల్లాలో గోవధ నిషేధ చట్టాన్ని ఉల్లంఘించకుండా, జంతు హింస నివారణ చట్టాలు ఉల్లంఘనలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా జిల్లాస్థాయిలో మున్సిపల్, పంచాయతీ, రెవెన్యూ, పశుసంవర్థక, రవాణా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ చట్టాలు ఉల్లంఘనలు జరక్కుండా ప్రత్యేకంగా నిఘా పెట్టి పర్యవేక్షించాలన్నారు .
జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకమైన ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. గోవధ నిషేధ చట్టం 2017 ప్రకారం గోవులను వధించడం చట్టరీత్యా నేరంగా పరిగణించాలని తెలిపారు. గోవధ నిషేధ చట్టం అమలు వంటి విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్రచారం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. మండల, డివిజన్ స్థాయిలోని విజిలెన్స్ కమిటీలు చట్టం అమలును పర్యవేక్షించాలన్నారు.





