News

జగన్నాథుడి రథానికి సుఖోయ్‌ యుద్ధ విమానం చక్రాలు

264views

కోల్‌కతాలోని జగన్నాథ ఆలయ రథానికి సుఖోయ్‌ యుద్ధ విమానం కోసం తయారు చేసిన టైర్లను వాడనున్నారు. ఈ నెల 27న కోల్‌కతాలో జరిగే జగన్నాథ రథయాత్ర కోసం రథాన్ని సరికొత్తగా సిద్ధం చేశారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత జగన్నాథ రథానికి బోయింగ్‌ విమానం టైర్ల స్థానంలో సుఖోయ్‌ కోసం తయారు చేసిన టైర్లు వచ్చాయి. ఇంతకు ముందు బోయింగ్‌ 747 విమానం టైర్లను రథానికి వాడేవారు. టైర్లను మార్చాలని 2005లో రథయాత్ర నిర్వాహక సంస్థ ఇస్కాన్‌ నిర్ణయించింది. కొత్త చక్రాల కోసం 20 ఏళ్లు అన్వేషించామని ఇస్కాన్‌ (కోల్‌కతా) ఉపాధ్యక్షుడు రాధారామ్‌ దాస్‌ వెల్లడించారు. 9టన్నుల బరువున్న రథానికి పలు కంపెనీల టైర్లు పరిశీలించినా కుదరలేదన్నారు. సుఖోయ్‌ టైర్ల కోసం 2018లో తయారీ సంస్థ ఎంఆర్‌ఎఫ్‌ను సంప్రదించడానికి ప్రయత్నించామని, గతేడాది ఆ సంస్థ ప్రతినిధులు అందుబాటులోకి వచ్చారని చెప్పారు. భారత వాయుసేనకు మాత్రమే ఈ టైర్లను సరఫరా చేస్తామని తొలుత వారు చెప్పారని వివరించారు. సమస్యను తెలియజేయడంతో టైర్లు ఇవ్వడానికి అంగీకరించారన్నారు. నాలుగు టైర్లను డెలివరీ చేశారని, వాటి ధర 1.80 లక్షల రూపాయలని రాధారామ్‌ వెల్లడించారు.