
సైనిక దళాలు వాటి యూనిఫారం ద్వారా కలిసి ఉంటాయే తప్ప మతం కారణంగా విడిపోవని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రతివారం రెజిమెంట్లో నిర్వహించే మతపర పరేడ్లో ఆ దళ సభ్యులు అందరూ పాల్గొనడం విధుల్లో భాగమేనని, దాన్ని ఉల్లంఘించడం క్రమశిక్షణరాహిత్యం కిందకే వస్తుందని తెలిపింది. మతపర పరేడ్లో పాల్గొనడానికి ఇష్టపడని ఓ క్రైస్తవ ఆర్మీ అధికారిని విధుల నుంచి తొలగించడం సబబేనని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ నవీన్ చావ్లా, జస్టిస్ శైలీందర్ కౌర్తో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. ఆ అధికారి విధులు నిర్వర్తించే రెజిమెంట్లో గురుద్వారా, మందిరం ఉన్నాయి. విధుల్లో భాగంగా జవాన్లు ప్రతివారం ఆ గుడిలోకి వెళ్లి పూజలు చేసి, మతపర పరేడ్లో పాల్గొనాల్సి ఉంటుంది. ట్రూప్ లీడర్గా ఆ అధికారే తన కింద పనిచేసే జవాన్లను గుడికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే తాను క్రిస్టియన్ను అయినందున అలాంటి పూజలు చేయలేనని, తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఉన్నతాధికారులు నిరాకరించారు. 2021 మార్చి 3న ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని సవాలు చేస్తూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.





