News

భారత్‌తో పెట్టుకుంటే అంతే.. నష్టనివారణ చర్యలకు దిగిన టర్కీ

234views

భారత్‌-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల వేళ టర్కీ అత్యుత్సాహంతో దాయాది దేశానికి బహిరంగ మద్దతు తెలిపి తగిన మూల్యం చెల్లించుకుంది. టర్కీ తీరును నిరసిస్తూ భారత్‌లో ఆ దేశానికి వ్యతిరేకంగా ‘బాయ్‌కాట్‌ టర్కీ #Boycott Turkey’ నినాదం ఊపందుకుంది. టర్కీ నుంచి దిగుమతి అయ్యే ఏ వస్తువులను భారత్‌లో విక్రయించవద్దని ఇక్కడి వ్యాపారులు నిర్ణయించుకుని ఆ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. మరోవైపు భారత పర్యాటకులు టర్కీ పర్యటనలను రద్దు చేసుకున్నారు. శత్రువుకు బహిరంగ మద్దతు తెలిపిన టర్కీ కోసం తాము తమ డబ్బును ఖర్చుపెట్టదల్చుకోలేదని వారు ప్రకటించారు.

దాంతో టర్కీకి దిమ్మతిరిగి బొమ్మ కనపడింది. పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు పలికితే తనకు ఎంత నష్టమో గ్రహించింది. అందుకే ఇప్పుడు నష్టనివారణ చర్యలకు దిగింది. టర్కీ పర్యాటక శాఖ భారత పర్యాటకులకు ఒక బహిరంగ అభ్యర్థన చేసింది. మా దేశంలో మీ భద్రతకు ఎలాంటి హాని జరగనీయబోమని, మీ వసతి సౌకర్యాలకు ఎలాంటి లోటు రానీయబోమని, మా దేశ పర్యటనను భారత పర్యాటకులు రద్దు చేసుకోవద్దని అభ్యర్థిస్తూ ఒక ప్రకటన వెలువరించింది.

కాగా, పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఇటీవల పాకిస్థాన్‌లోని, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో సర్జికల్ స్ట్రైక్స్‌ చేసింది. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. దాంతో దాయాది పాకిస్థాన్‌ ఉగ్రవాదులు మద్దతుగా భారత్‌తో కయ్యానికి కాలుదువ్వింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడులు చేసింది. పాక్‌ దాడులను ధీటుగా తిప్పికొట్టి భారత సైన్యం తగిన బుద్ధిచెప్పింది.

అయితే భారత్‌-పాకిస్థాన్‌ దేశాల మధ్య పరస్పర దాడులు జరుగుతున్న సమయంలో టర్కీ పాకిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు తెలిపింది. పాకిస్థాన్‌ సైన్యానికి అండగా తన నేవీ షిప్‌ను కూడా పంపింది. సరిగ్గా అప్పుడే పాకిస్థాన్‌పై భారత్‌ చేసిన భీకర దాడులకు జడుసుకుని తోకముడిచింది. అయితే అప్పటికే టర్కీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భారత పౌరుల దృష్టిలో టర్కీ ఒక విలన్‌లా మిగిలిపోయింది.