News

ఔరంగజేబ్‌ గొప్ప పాలకుడు.. ఎస్పీ వివాదాస్పద వ్యాఖ్యలు

362views

సమాజ్‌వాదీ పార్టీ నేత అబు అజ్మీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొఘల్ చక్రవర్తి ఔరంగ్‌జేబ్ మంచి పాలకుడని కితాబు ఇచ్చారు. ఆయన ఎంతమాత్రం క్రూరుడు కాదంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో సహా పలు పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు ‘దేశద్రోహం’ కిందకు వస్తాయని, ఆయనపై లీగల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

సున్నితమైన అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అబు అజ్మికి కొత్త కాదు. తాజాగా ఆయన ఔరంగజేబ్‌ను కనికరం లేని నేత అనడం సరికాదని, ఆయన మంచి పాలకుడని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ”ఒకప్పటి పాలకులు అధికారం కోసం, ఆస్తుల కోసం పోరాడేవారు. మతం కోసం కాదు. ఆయన (ఔరంగజేబ్) 52 ఏళ్లు పాలన సాగించారు. ఆయనే కనుక హిందువులను ముస్లింలుగా మార్చి ఉంటే ఎంతమంది హిందువులు ఎంతమంది ముస్లింలుగా మారేవారో ఊహించుకోవచ్చు” అని వ్యాఖ్యానించారు. ఔరంగజేబ్ ఆలయాలను ధ్వంసం చేసి ఉంటే, ఆయన మసీదులను కూడా ధ్వంసం చేసేవారనీ, ఆయనే కనుక హిందూ వ్యతిరేకి అయితే 34 శాతం హిందువులు ఆయనతో ఉండేవారుకాదని, ఆయన సలహాదారుల్లో కూడా హిందువులకు చోటు ఉండేది కాదని వివరించారు. దీనిని హిందూ-ముస్లిం కోణంలో చూడాల్సిన అవసరం లేదన్నారు. భారతదేశం రాజ్యాంగం ఆధారంగా నడుస్తున్న దేశమైనందున ఇంతకంటే తాను ఎక్కువ మాట్లాడలేదని చెప్పారు.

చరిత్ర తెలుసుకో… షిండే ఫైర్
ఔరంగజేబ్‌ను ప్రశంసిస్తూ అబు అజ్మి చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఛత్రపతి శంభాజీ మహరాజ్‌ను ఔరంగజేబ్ చిత్రహింసలు పెట్టిన విషయం గుర్తులేదా? అని ప్రశ్నించారు. ఆయన (అజ్మీ) ఇచ్చిన స్టేట్‌మెంట్ తప్పని, 40 రోజుల పాటు ఛత్రపతి శంభాజీ మహరాజ్‌ను ఔరంగజేబ్ చిత్రహింసలు పెట్టారని అన్నారు. అలాంటి వ్యక్తిని మంచివాడని పొడగడం కంటే పాపం మరొకటి ఉండదన్నారు. అబు అజ్మి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చాలా సీరియస్‌గా ఉన్నారని, అబు అజ్మీ వ్యాఖ్యలు ‘రాజద్రోహం’ కిందకు వస్తాయని చెప్పారు. శివసేన నేత షైనా ఎన్‌సీ సైతం అబు అజ్మి వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఎస్పీ నేత మళ్లీ బడికి వెళ్లి చరిత్ర చదవడం మంచిదన్నారు. ఔరంగజేబ్ కేవలం ఆలయాలనే ధ్వంసం చేశారని, ఒక్క ఆలయాన్ని కూడా కట్టించలేదని తెలిపారు.

ఛావా సినిమా చూడండి..
అబు అజ్మీ వ్యాఖ్యలపై బీజేపీ నేత రామ్ కదమ్ మండిపడ్డారు. థియేటర్‌కు వెళ్లి ‘ఛావా’ సినిమా చూడాలని ఆయనకు సూచించారు. ముందు చరిత్ర తెలుసుకోవాలని, గొప్ప నేత అని మీరు (అబు అజ్మి) చెబుతున్న ఔరంగజేబ్ అత్యంత పాశవికంగా శంభాజీ రాజాను చంపారని, శంబాజీ రాజాను జైలులో పెట్టారని, అలాంటి ఔరంగజేబ్‌ను గొప్ప పాలకుడంటూ పొగడటం సిగ్గుచేటని అన్నారు. ‘ఛావా’ చిత్రం ఇటీవల దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించి, ఔరంగజేబ్‌కు వ్యతిరేకంగా బలమైన సెంటిమెంట్లు వ్యక్తమవుతున్న తరుణంలో అబు అజ్మీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనమవుతోంది.