News

ఖలీస్థానీలు రెడ్ లైన్ దాటారు..

218views

కెనడాలోని బ్రాంప్టన్ హిందూ మందిరంపై దాడుల నేపథ్యంలో ఖలిస్థానీ తీవ్రవాదులు రెడ్ లైన్‌ను దాటారని కెనడాలో భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య ట్వీట్ ద్వారా వ్యాఖ్యానించారు. హిందూ-కెనడియన్ భక్తులపై జరిగిన ఈ దాడితో కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదం ఏ స్థాయికి చేరుకుందో తెలిసిందని అన్నారు. ఖలిస్తానీలు న్యాయ సంస్థల్లోకి పూర్తిగా చొరబడ్డారంటూ ‘భావ ప్రకటనా స్వేచ్ఛ’ పేరుతో కెనడాలో ఈ తీవ్రవాదులకు స్వేచ్చ లభిస్తోందన్నారు. హిందూ కమ్యూనిటీ రక్షణ కోసం హిందూ-కెనడియన్లు ముందుకొచ్చి తమ హక్కులను పొందాలన్నారు. ఇలాంటి ఘటనలకు రాజకీయ నాయకులను బాధ్యులుగా చేయాలని ఎంతో కాలంగా తాను చెబుతున్నానని చంద్ర ఆర్య అన్నారు.


బ్రాంప్టన్ హిందూ ఆలయంపై దాడి ఘటన గురించి విజయ్ జైన్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా కెనడాలోని పోలీసులకు సమాచారం ఇచ్చారు. మందిరంలోని హిందువుల ఖలిస్థానీలు దాడులు చేస్తున్నారని ఆ ట్వీట్‌లో కెనడా ప్రధానిని కూడా విజయ్ ట్యాగ్ చేశారు. దీంతో పోలీసులు వెంటనే మందిరం వద్దకు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు.

ఈ ఘటనపై కెనడా పోలీసులు స్పందిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును తాము గౌరవిస్తామన్నారు, సంయమనం పాటించాలని కోరారు. కానీ నేరపూరిత హింసాత్మక చర్యలను తాము సహించేది లేదని చెప్పారు. హింసకు పాల్పడే వారిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.మరో వైపు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హిందూ దేవాలయంపై దాడిని ఖండించారు. ఆలయంపై దాడి ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదంటూ ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులకు ట్రూడో ధన్యవాదాలు తెలిపారు. ఈ సంఘటనను కెనడాలోని భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది.

కెనడా ప్రభుత్వంలో రవాణా మంత్రిగా ఉన్న భారత సంతతి అనితా ఆనంద్ మాట్లాడుతూ ఈ దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పందించారు. కెనడాలో హిందువులు, అన్ని మతాలవారికి తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కు ఉందన్నారు.

కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉన్న హిందూ మందిరంపై జరిగిన దాడిలో ఖలిస్థాన్ మద్దతుదారులు కొందరు హిందూ, కెనడియన్ భక్తులు లక్ష్యంగా ఆలయం దగ్గర పలువురు భక్తులను కొట్టారు. కొంతమంది ఖలిస్థాన్ జెండాలు పట్టుకుని ఆలయం తలుపులను నాశనం చేశారు. మందిరం దగ్గర పెద్ద ఎత్తున పోలీసులను మోహరించినప్పటికీ భక్తులపై దాడి జరగడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ కలకలం రేపుతున్నాయి.