News

మేధో వికాసం మాతృమూర్తితోనే సాధ్యం

63views

వ్యక్తుల మేధో వికాసం మాతృమూర్తితోనే సాధ్యమని చైతన్య తపోవనం పీఠాధిపతి మాతా శివ చైతన్య అన్నారు. విజయవాడ సత్యనారాయణపురంలోని సంస్కృత భారతి సంస్థ రెండు రోజులపాటు జాతీయ స్థాయి అఖిల భారత బాల కేంద్ర శిక్షకుల ప్రశిక్షా కార్యక్రమం నిర్వహించింది. శిక్షణ కార్యక్రమాలను మాతా శివ చైతన్య ప్రారంభించారు.

ఈ సందర్బంగా మాతా శివ చైతన్య ప్రసంగిస్తూ వ్యక్తులను సమాజాన్ని వేరువేరుగా చూడలేమని సత్‌ సంప్రదాయం తల్లి వలనే సాధ్యమన్నారు. రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రతి నగరంలోనూ బాల సంస్కృత కేంద్రాలను ప్రారంభించాలని కోరారు. మహామహోపాధ్యాయ దోర్బల ప్రభాకర శర్మ నగరంలో విజయవాడ సంస్కృత భారతి కేంద్రం ఎందరో యువతీ యువకులకు శిక్షణ ఇస్తోందన్నారు. దుర్గ గుడి ఈఓ రామరావు, అఖిలభారత ప్రశిక్షణ ప్రముఖులు ఉపద్రష్ట రమణ మూర్తి సంస్కృత అధ్యయనం అంశంగా ప్రసంగించారు. దేశంలోని 30 రాష్ట్రాలనుంచి 86 బాల కేంద్రం ప్రముఖులు పాల్గొన్నారు.