
ప్రధాన సబ్జెక్టుతో పాటు ఇతర ఐచ్ఛికాంశాలుగా కామర్స్, కంప్యూటర్ సైన్స్, రాజనీతి శాస్త్రం వంటి వాటిని ఎంచుకోవడానికి ఇష్టపడని విద్యార్థులకు దిల్లీ విశ్వవిద్యాలయ హిందూ ధార్మిక అధ్యయన కేంద్రం ప్రత్యామ్నాయాలను అందించనుంది. ఇలాంటి విద్యార్థులు ఇకపై వేద సాహిత్యం, ఉపనిషత్ పరిచయం, భగవద్గీత, పురాణ పరిచయం వంటి ఐచ్ఛికాలను ఎంపిక చేసుకునే సౌలభ్యాన్ని కల్పించాలని ఈ కేంద్రం నిర్ణయించింది. కామర్స్, కంప్యూటర్ సైన్స్, రాజనీతి శాస్త్రాలను ప్రధాన సబ్జెక్టులుగా ఎంచుకునే విద్యార్థులకు హిందూ జీవన దృష్టి, హిందూ మనోవిజ్ఞానం వంటి రెండు జనరల్ ఐచ్ఛికాంశాలను అందించాలని కూడా అధ్యయన కేంద్రం ప్రతిపాదిస్తోంది. ఈ నెల 12న దిల్లీ విశ్వవిద్యాలయ విద్యా విషయక మండలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ఆమోదించిన పాఠ్య ప్రణాళికకు తోడు హిందూ మతానికి సంబంధించిన అంశాలను విద్యార్థులకు అందించాలని హిందూ ధార్మిక అధ్యయన కేంద్రం తలపెట్టింది.




