అమెరికా మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్ నగరంలోని హిందూ దేవాలయంలో మే 24 నుండి 28 వరకు నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు భారీగా నిధులు సమకూరినట్లు ఆలయ పాలకమండలి అధ్యక్షుడు, బ్రహ్మోత్సవల కమిటీ అధ్యక్షుడు గంగవరపు రజనీకాంత్ తెలిపారు. పంచ వాహనాలను ఇప్పటికే సిద్ధం చేశామని, ప్రత్యేకంగా వైదిక, ఆగమ శాస్త్ర పండితులను బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. శాస్త్రోక్తంగా ఈ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.
రూ. 8 కోట్లకు పైగా విరాళాలు లభించినట్లు బ్రహ్మోత్సవాల నిధుల సేకరణ కమిటీ అధ్యక్షుడు బుడ్డి విజయ్ తెలిపారు. లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న ఈ వేడుకలకు నిధులను సద్వినియోగం చేస్తామని పేర్కొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు విజయ్, ఉత్సవాల కార్యదర్శి పుట్టగుంట మురళీ, బోర్డు సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, మీడియా కమిటీ అధ్యక్షుడు రాజా సూరపనేని, ఉపాధ్యక్షుడు పోట్ల రవి తదితరులు వేడుకల విజయవంతం చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.





