
ఇస్లాం మతాన్ని విశ్వసించే వ్యక్తి భార్య జీవించి ఉండగా మరో మహిళతో సహజీవనం చేసే హక్కును పొందలేరని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తన జీవిత భాగస్వామితో విడాకులు తీసుకోకుండా వేరొక వ్యక్తితో కలిసి ఉండటాన్ని ముస్లిం వివాహ చట్టం అనుమతించదని అభిప్రాయపడింది. మహిళ కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించిన స్నేహ దేవి, మహద్ షాదాబ్ ఖాన్ కేసును విచారించిన జస్టిస్ ఎ.ఆర్.మసూది, ఎ.కే.శ్రీవాస్తవలతో కూడిన ధర్మాసనం ఈ విధంగా పేర్కొంది. 2020లో ఫరీదా ఖాతూన్ అనే మహిళను షాదాబ్ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. ప్రస్తుతం ఫరీదా తన తల్లిదండ్రులతో జీవిస్తుండగా.. అతడు మాత్రం స్నేహా దేవితో సహజీవనం చేస్తున్నాడు. స్నేహా దేవి కుటుంబసభ్యులు మాత్రం షాదాబ్ ఆమెను అపహరించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కోర్టుకు వెళ్లిన అతడు తాము ఇష్ట ప్రకారమే కలిసి జీవిస్తున్నామని, తనపై కిడ్నాప్ కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. బుధవారం విచారణ జరిపిన హైకోర్టు ఆర్టికల్ 21 ప్రకారం ఈ కేసులో ఎటువంటి రక్షణను కల్పించలేమని, స్నేహా దేవిని భద్రత మధ్య తన కుటుంబానికి అప్పగించాలని పోలీసులను ఆదేశించింది.





