
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. ఈ మేరకు కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇంజినీరింగ్ చదువుతున్న ప్రీతి రావత్, ఆస్తా శ్రీవాస్తవ, సాధన సాహ్నీలు ఈ పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరంలో ఉన్న రాముడి చిత్రంలో అమర్చిన సెన్సర్లు 24 గంటలూ పనిచేస్తాయని విద్యార్థులు చెప్పారు. ‘‘ఈ పరికరం దొంగల నుంచి రక్షణ కల్పిస్తుంది. దొంగలు ఇంట్లోకి ప్రవేశిస్తే.. సమీపంలోని పోలీస్స్టేషన్కు, ఇరుగు పొరుగు ఇళ్ల వారికి సమాచారం అందిస్తుంది. శ్రీరాముడి చిత్రంలో పానిక్ జీఎస్ఎం చిప్ను అమర్చాం. ఈ పరికరంలో సిమ్ కార్డు ఉంది. రామయ్య చిత్రానికి అనేక వైర్లెస్ పానిక్ బటన్లను లింక్ చేయవచ్చు. ఈ బటన్లను ఇంటి లోపల, లాకర్, టీవీ రిమోట్లో అవసరాన్ని బట్టి అమర్చవచ్చు’’ అని ఆస్తా శ్రీవాస్తవ తెలిపింది. దీని తయారీకి కేవలం రూ.2,000 ఖర్చయిందని, నాలుగు రోజుల సమయం పట్టిందని విద్యార్థినులు వెల్లడించారు. ఈ పరికరంలో మనకు నచ్చిన చిత్రాలేవైనా పెట్టుకోవచ్చు.





