
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 – 5 నిమిషాలు సాక్షాత్కరించింది. ఈ అపూర్వ ఘట్టాన్ని ఎల్ఈడీ తెరలపై చూసి ఆలయ ఆవరణలోని అసంఖ్యాక భక్తులు పులకించిపోయారు. ఆలయంలోని మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా పైపులు, కటకాలు, అద్దాలతో దీనికోసం శాస్త్రవేత్తలు ఒక వ్యవస్థను రూపొందించారు. ప్రతి శ్రీరామనవమి రోజున శ్రీరాముడి విగ్రహంపై ఈ సూర్యతిలకం ప్రసరించేలా గడియారంలో ముల్లులు తిరిగేందుకు ఉపయోగించే పరిజ్ఞానం తరహాలో గేర్ టీత్ మెకానిజం వినియోగించారు. ఈ వ్యవస్థ 19 ఏళ్లు నిరాటంకంగా పనిచేస్తుంది. ఆ తర్వాత మరోసారి సమయాన్ని సరిచేస్తారు. నల్బాడీ (అస్సాం) ఎన్నికల ర్యాలీ అనంతరం గగనతలంలో హెలికాప్టర్లో ప్రయాణిస్తూ బాలరాముడి నుదుటిపై ‘సూర్య’తిలకం ఏర్పడిన అపురూప ఘట్టాన్ని తన ట్యాబ్లో ప్రధాని వీక్షించారు. ఆ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని భావోద్వేగానికి గురయ్యారు.





