
జమ్మూకశ్మీర్లో సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) ఉపసంహరించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని హోంమంత్రి అమిత్ షా మంగళవారం తెలిపారు. ఆ కేంద్రపాలిత ప్రాంతం నుంచి బలగాలను వెనక్కి తీసుకొని, అక్కడ శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతలను రాష్ట్ర పోలీసులకే అప్పగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. గతంలో జమ్మూకశ్మీర్ పోలీసులను విశ్వసించేవాళ్లు కాదని, ఇప్పుడు ఆ బలగాలే ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్లలో ముందుంటున్నాయని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఏఎఫ్ఎస్పీఏ కింద.. కల్లోలిత ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించే సైన్యానికి సోదాలు, అరెస్టు, కాల్పులు జరపడానికి విస్తృత అధికారాలు లభిస్తాయి. జమ్మూకశ్మీర్లో సెప్టెంబరులోపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అమిత్ షా తెలిపారు. రాష్ట్రంలో ఓబీసీలకు మోదీ ప్రభుత్వం తొలిసారిగా రిజర్వేషన్లు ఇచ్చిందన్నారు. మహిళలకూ మూడోవంతు రిజర్వేషన్లు ఇచ్చామని పేర్కొన్నారు.





