
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు మంగళసూత్రాలు, లక్ష్మీకాసులు విక్రయించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. బంగారు మంగళసూత్రాలను తయారు చేసి శ్రీవారిపాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించి భక్తులకు విక్రయిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
మతమార్పిళ్ళకు అడ్డుకట్ట వేసే ధర్మ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. గతంలో టీటీడీ ఆధ్వర్యంలో 32 వేల మందికి సామూహిక వివాహాలు జరిపి మంగళసూత్రాలు అందించామని వారిలో ఏ ఒక్కరూ మతం మారలేదని కరుణాకర్ రెడ్డి చెప్పారు. 5, 10 గ్రాముల బరువుతో నాలుగైదు డిజైన్లలో మంగళసూత్రాల విక్రయాలు జరుగుతాయన్నారు. ఇందులో ఎలాంటి లాభాపేక్ష లేదని కేవలం ధర్మ ప్రచారమేనని స్పష్టం చేశారు.
వార్షిక బడ్జెట్ ను రూ.5,141.74 కోట్ల అంచనాతో పాలకమండలి ఆమోదించింది. అలాగే పలు కీలక నిర్ణయాల అమలుకు చర్యలు చేపట్టింది. శ్రీపద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పేరును శ్రీపద్మావతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్గా మార్చగా పాలకమండలి ఆమోదించింది.
ఆకాశగంగ నుంచి ఔటర్ రింగ్రోడ్డు వరకు ఉన్న రెండు వరుసల రహదారిని నాలుగు వరుసలగా మార్చి అభివృద్ధి చేయాలని పాలకమండలి సమావేశంలో నిర్ణయించారు. టీటీడీ ఆధ్వర్యంలోని 26 స్థానిక ఆలయాలు, విలీనమైన 34 ఆలయాల్లో ఉద్యోగాల నియామకం కోసం ప్రభుత్వ ఆమోదానికి ప్రతిపాదనలు పంపారు.





