News

ముంబైలో రామ భక్తులపై దాడుల నిందితులపై బుల్డోజర్‌ యాక్షన్‌

445views

అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని మహారాష్ట్రలో తీసిన ర్యాలీలో రాముడి భక్తులపై ఓ వర్గం వారు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ముంబై శివార్లలోని మీరా రోడ్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. తాజాగా ఆ ప్రాంతంలో(మీరా రోడ్డు) మహారాష్ట్ర సర్కార్‌ బుల్డోజర్‌ చర్యకు దిగింది.

అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో.. రాముని ఊరేగింపుపై రాళ్లు రువ్విన వారి నివాసాలను బుల్డోజర్‌లతో కూల్చివేసింది. మీరా రోడ్డులో అక్రమంగా నిర్మించిన కట్టడాలను బుల్డోజర్‌తో కూలగొట్టింది. దాదాపు 15 అక్రమ బిల్డింగ్‌లను నేలమట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. కూల్చివేత సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

ముంబై శివార్లలోన మీరా రోడ్డులో కార్లు, బైక్‌లపై కాషాయ జెండాతో ఆదివారం రాముడి శోభా యాత్ర నిర్వహించారు.ఈ ర్యాలీలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేశారు. దీనిపై స్పందించిన బీజేపీ సర్కార్‌ నిందితుల స్థలాల వద్ద బుల్డోజర్‌ యాక్షన్‌ చేపట్టింది.