
అయోధ్యలోని నూతన రామాలయంలో ఈనెల 22న బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరగనుంది. ఈ ఉత్సవంలో మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన డమరూ బృందం పాల్గొననుంది. 108 మంది సభ్యుల డమరూ బృందం జనవరి 22న అయోధ్యలో ప్రదర్శన ఇవ్వనుంది. దేశంలో రామ భజన, రామ స్తుతి, శివ తాండవ స్తోత్రాన్ని పఠించే ఏకైక బృందంగా భోపాల్ డమరూ బృందం పేరుగాంచింది.
జనవరి 22న అయోధ్యలో దేశ నలుమూలలకు చెందిన పలువురు కళాకారులు తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ నేపధ్యంలోనే భోపాల్కు చెందిన డమరూ బృందం కూడా తమ ప్రదర్శనతో ఉర్రూతలూగించనుంది. భోపాల్లోని శ్రీ బాబా బటేశ్వర్ కీర్తన సమితికి అయోధ్య నుండి ఆహ్వానం అందింది. దీంతో జనవరి 22న రామభక్తులు ఆలయానికి వెళ్లే మార్గంలో శ్రీ బాబా బటేశ్వర్ కీర్తన సమితికి చెందిన డమరూ బృందం ప్రదర్శన ఇవ్వనుంది.
జనవరి 20న ఈ డమరూ బృందానికి చెందిన 108 మంది సభ్యులు అయోధ్యకు చేరుకుంటారు. అక్కడ వారు 21న రిహార్సల్ చేస్తారు. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర వీవీఐపీల సమక్షంలో వీరి ప్రదర్శన సాగనుంది.





