News

సన్‌బర్న్‌ షోలో ‘శివుడి ఫొటో’.. నిర్వాహకులపై ఫిర్యాదు

251views

గోవాలో నిర్వహించిన సన్‌బర్న్‌ కార్యక్రమంలో చోటు చేసుకున్న ఓ విషయంపై కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు ఆగ్రహించారు. అక్కడితో ఆగకుండా కార్యక్రమ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజులపాటు జరిగిన సన్‌బర్న్‌ ఎలక్ట్రానిక్‌ డీజే షోలో భాగంగా డిజటల్‌ స్క్రీన్‌పై శివుడి ఫొటో ప్రదర్శించడం వివాదం రేపింది. ఈ ఘటనను కాంగ్రెస్‌ నేత విజయ్‌ బైకే తీవ్రగా ఖండించారు. దీనిపై ఆయన శుక్రవారం గోవాలోని మాపూసా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. షో నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ ఘటనపై స్పందించిన గోవా ఆప్ అధ్యక్షుడు అమిత్‌ పాలేఖర్‌.. సనాతన ధర్మాన్ని అవమానించిన సన్‌ బర్న్‌ డీజే షో నిర్వాహకులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రెండు రోజుల పాటు గోవాలోని వాగ్‌తోర్‌లో జరిగిన ఈ షోలో.. అందరూ మద్యం తాగుతూ, డ్యాన్స్‌లు చేస్తున్న సమయంలో అక్కడి డిజిటల్‌ స్క్రీన్‌పై శివుడి ఫొటో ప్రదర్శించారని అన్నారు. సనాతన ధర్మాన్ని అవమాన పరిచిన షో నిర్వాహకులపై చర్యలు తీసుకునే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు.

విజయ్‌ బైకే మాట్లాడుతూ.. ఉద్దేశపూరితంగా తాగుతూ, డ్యాన్స్‌లు చేస్తున్న సమయంలో షో నిర్వాహకులు శివుడి ఫొటో స్క్రీన్‌పై వేశారని అన్నారు. ఇలాంటి చర్యలలో హిందూవుల మనోభావాలను కించపరిచినట్లు అవుతుందని మండిపడ్డారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అధికారులు చర్యలు తీసుకుంటామని తెలిపారని చెప్పారు.