News

కెనడాలో ప్రవాస భారతీయుడిపై కాల్పులు, హిందూ సమాజంలో ఆందోళన

271views

కెనడాలో ఓ హిందూ వ్యాపారి పై హత్యాయత్నం జరిగింది. కెనడాలోని సర్రే లో స్థిరపడిన ప్రవాస భారతీయుడు లక్ష్యంగా కాల్పులు జరిగాయి. ఇటీవల కాలంలో హిందువులే లక్ష్యంగా కెనడాలో దాడులు పెరిగాయి.శ్రీ లక్ష్మీనారాయణ్ మందిర్ అధ్యక్షుడు సతీశ్ కుమార్, కుమారుడి నివాసం వద్ద డిసెంబర్ 27న దుండగులు కాల్పులకు తెగబడ్డారు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న రాయల్ కెనిడియన్ మౌంటెడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కాల్పుల్లో ధ్వంసమైన బాధితుడి ఇంటిని పరిశీలించారు. హత్యాయత్నానికి కారణాలు తెలుసుకునేందుకు యత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో పోలీసులను మోహరించడంతో పాటు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు, ప్రత్యక్ష సాక్ష్యులను విచారిస్తున్నట్లు తెలిపారు.

హిందువులే లక్ష్యంగా ఖలిస్తానీ తీవ్రవాదులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రవాసభారతీయుడైన కెనడా పార్లమెంటు సభ్యుడు చంద్ర ఆర్య గతంలోనే ఆందోళన వెలిబుచ్చారు. సర్రేలోని లక్ష్మీనారాయణ ఆలయ సమీపంలో ఖలిస్తానీ తీవ్ర వాదులు అలజడి సృష్టించేందుకు యత్నించిన ఘటనను గుర్తు చేశారు. కెనడాలోని హిందూ సమాజం లక్ష్యంగా దాడులు పెరిగాయి. పలు ప్రాంతాల్లో హిందూ ఆలయాలను ధ్వంసం చేశారు. ఖలిస్తానీయులే ఈ దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.