
బంగ్లాదేశ్ నుంచి భారత్కు 1966-1971 మధ్య కాలంలో వలస వచ్చిన వారి వల్ల అస్సాం రాష్ట్ర జనాభా, సాంస్కృతిక గుర్తింపుపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపే సమాచారం ఏదీ తన ముందు లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6ఏ ద్వారా 1966 నుంచి 2013 వరకు పౌరసత్వం పొందిన వలసదారుల వివరాలను అందజేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది.
1985లో పౌరసత్వ చట్టాన్ని సవరించి ‘సెక్షన్ 16ఎ’ను చేర్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. బంగ్లాదేశ్ విమోచన కోసం భారత్-పాకిస్థాన్ మధ్య 1971లో జరిగిన యుద్ధాన్ని, ఆ సమయంలో వెల్లువెత్తిన వలసలను ధర్మాసనం ప్రస్తావించింది. సెక్షన్ 16ఎ వల్ల అక్రమ వలసదారులు పెరిగిపోతున్నారని, దానిని రద్దు చేయాలని పిటిషనర్లు కోరుతున్నారు.





