News

జ్ఞానవాపి మసీదు సర్వే ; నివేదిక సమర్పణకు గడువు కోరిన ఏఎస్‌ఐ

249views

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ విశ్వనాథుని ఆలయం పక్కన గల జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో జరిపిన శాస్త్రీయ సర్వే నివేదిక సమర్పణకు మరో మూడు వారాల వ్యవధి కావాలని భారత పురాతత్వ సర్వేక్షణ సంస్థ (ఏఎస్‌ఐ) మంగళవారం జిల్లా కోర్టును కోరింది. ఈ దరఖాస్తును కోర్టు బుధవారం విచారించనుంది. వాస్తవానికి ఏఎస్‌ఐ తన సర్వేను పూర్తిచేసి ఈ నెల 28 కల్లా నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

కాశీ విశ్వనాథ ఆలయం పక్కనే 17వ శతాబ్దిలో నిర్మించిన జ్ఞానవాపి మసీదును ఏదైనా హిందూ ఆలయాన్ని కూల్చి నిర్మించారా? అనేది తేల్చడానికి ఏఎస్‌ఐ ఆగస్టు 4 నుంచి సర్వే జరిపింది. మసీదులో సీలు చేసిన విభాగాన్ని మినహాయించి బారికేడ్‌ చేసిన ప్రాంతంలో సర్వే పూర్తిచేసింది. ఈ సందర్భంగా లభ్యమైన సమాచారాన్ని పురాతత్వవేత్తలు, సర్వేదారులు, ఇతర నిపుణులు పరిశీలిస్తున్నారని, ఈ ప్రక్రియను పూర్తిచేసి నివేదిక సమర్పించడానికి మరో మూడు వారాల వ్యవధి కావాలని ఏఎస్‌ఐ కోర్టుకు తెలిపింది.