
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో కాశీ విశ్వనాథుని ఆలయం పక్కన గల జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో జరిపిన శాస్త్రీయ సర్వే నివేదిక సమర్పణకు మరో మూడు వారాల వ్యవధి కావాలని భారత పురాతత్వ సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) మంగళవారం జిల్లా కోర్టును కోరింది. ఈ దరఖాస్తును కోర్టు బుధవారం విచారించనుంది. వాస్తవానికి ఏఎస్ఐ తన సర్వేను పూర్తిచేసి ఈ నెల 28 కల్లా నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
కాశీ విశ్వనాథ ఆలయం పక్కనే 17వ శతాబ్దిలో నిర్మించిన జ్ఞానవాపి మసీదును ఏదైనా హిందూ ఆలయాన్ని కూల్చి నిర్మించారా? అనేది తేల్చడానికి ఏఎస్ఐ ఆగస్టు 4 నుంచి సర్వే జరిపింది. మసీదులో సీలు చేసిన విభాగాన్ని మినహాయించి బారికేడ్ చేసిన ప్రాంతంలో సర్వే పూర్తిచేసింది. ఈ సందర్భంగా లభ్యమైన సమాచారాన్ని పురాతత్వవేత్తలు, సర్వేదారులు, ఇతర నిపుణులు పరిశీలిస్తున్నారని, ఈ ప్రక్రియను పూర్తిచేసి నివేదిక సమర్పించడానికి మరో మూడు వారాల వ్యవధి కావాలని ఏఎస్ఐ కోర్టుకు తెలిపింది.





