
తిరుమల ఆలయంపై హెలిక్టాఫర్లు చెక్కర్లు కొట్టడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subbareddy) స్పందించారు. తిరుమల ఆలయంపై చెకర్లు కొట్టిన హెలికాప్టర్లు మిలిటరీదని తెలిసిందన్నారు. దేశ భద్రత విషయంలో మనం జోక్యం చేసుకోలేమని చెప్పారు. గురువారం ఉదయం టీటీడీ ఉద్యోగుల కోసం నిర్మించిన కమ్యూనిటీ హాల్ను టీటీడీ చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సులభ కార్మికులు ఆకస్మికంగా విధులు బహిష్కరించి భక్తులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. మొదట విధులకు హాజరై ఆ తర్వాత వారి డిమాండ్లు అడిగితే తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నకిలీ వెబ్సైట్లు, బ్లాక్లో దర్శనం టికెట్లకు కారణం అవుతున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టీటీడీ ఉద్యోగులకు త్వరలో ఇళ్ల స్థలాలు మంజూరు పూర్తిచేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈనెల 25న తిరుమల కొండపై మూడు హెలికాఫ్టర్లు చెక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.





