News

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి చెందిన ఐదుగురు అరెస్టు

378views

నిషేధానికి గురైన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి చెందిన ఐదుగురిని కేరళ, కర్ణాటకలలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మంగళవారం అరెస్ట్ చేసింది. బిహార్‌లోని ఫుల్వారి షరీఫ్‌లో ఆ రాష్ట్ర పోలీసులు గత ఏడాది నిర్వహించిన దాడుల్లో కొన్ని అభ్యంతరకర పత్రాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘విజన్ 2047 ఇండియా’ అనే డాక్యుమెంట్‌ను కూడా అప్పట్లో స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. భారత దేశంపై దాడి చేయాలనే లక్ష్యంతో ఈ డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు పోలీసులు తెలిపారు.

కేరళలోని కాసర్‌గోడ్ , దక్షిణ కన్నడలలో ఎనిమిది చోట్ల ఆదివారం నుంచి ఎన్ఐఏ బృందాలు సోదాలు నిర్వహించాయి. కోట్లాది రూపాయల లావాదేవీలకు సంబంధించిన పత్రాలను, అనేక డిజిటల్ డివైసెస్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిషేధం అమలవుతున్నప్పటికీ తమ హింసాత్మక సిద్ధాంతాల ప్రచారాన్ని, ఇతర కార్యకలాపాలను కొనసాగించాలని పీఎఫ్ఐ కేడర్ నిర్ణయించుకుందని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. తూర్పు చంపారన్‌ జిల్లాలో ఓ వర్గానికి చెందిన ఓ వ్యక్తిని చంపేందుకు ఇటీవలే తుపాకీని కూడా పీఎఫ్ఐ కేడర్ అందజేసిందన్నారు.

కాసర్‌గోడ్, దక్షిణ కన్నడలలో అరెస్టయినవారు విదేశాల నుంచి అక్రమంగా నిధులను సేకరిస్తూ, మన దేశంలోని పీఎఫ్ఐ సభ్యులకు అందజేస్తున్నారని ఎన్ఐఏ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.