
కశ్మీర్లోని గాంధర్బల్ జిల్లాలో ఉన్న ప్రఖ్యాత ఖీర్ భవానీ (Kheer Bhavani) ప్రార్థనా మందిరాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఆయన సోదరి ప్రియాంక గాంధీ మంగళవారం నాడు సందర్శించారు. భారత్ జోడో యాత్ర ముగిసిన మరుసటి రోజే ఇద్దరూ కలిసి ప్రార్థనా మందిరాలను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉభయులూ అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో పాటు 15 నిమిషాల పాటు అక్కడే ఉన్నారు. ఖీర్ భవానీ ఆలయం కశ్మీర్ పండిట్లకు అత్యంత ఆరాధనీయ మందిరంగా ఉంది. వసంతకాలం రోజుల్లో ఆలయం కింద ప్రవహించే జలాల రంగు కశ్మీర్లోని పరిస్థితిని సూచిస్తుందని భక్తులు బలంగా విశ్వసిస్తుంటారు. మిగతా రంగులకు పెద్దగా ప్రాధాన్యం లేనప్పటికీ, నలుపు లేదా, డార్క్ కలర్ జలాలు ప్రవహిస్తుంటే కశ్మీర్కు గడ్డుకాలమనే సంకేతంగా భక్తులు భావిస్తుంటారు.
అయితే.. సాధారణంగా హిందూ దేవుళ్లకు, మతానికి దూరంగా ఉండే.. రాహుల్, ప్రియాంకలు.. భవానీ మాతకు పూజలు చేయడం విడ్డూరంగా ఉంది. ఇటీవల ఆర్ఎస్ఎస్పై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. ఈక్రమంలో కశ్మీర్ పండిట్లు ఎంతో భక్తిశ్రద్దలతో కొలిచే అమ్మవారిని దర్శించుకోవడంపై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. 2021 సెప్టెంబర్లో బీజేపీ నాయకులు రాహుల్పై కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన రాహుల్… తాను కశ్మీర్ పండిట్నని, ఇక్కడ పండిట్లంటే తనకెంతో ఇష్టమని తెలిపారు. జై మాతాజీ అంటూ నినాదాలు చేశారు.





