
భారత సరిహద్దు ప్రాంతాలైన రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మోర్టారు దాడులు, కాల్పులకు తెగబడ్డ పాకిస్తాన్కు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పింది. పాక్కు చెందిన 7సైనిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. పలువురు పాక్ సైనికులు గాయపడ్డారు. పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి సోమవారం పాక్ మోర్టారు దాడులు చేయడంతో ఓ బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, ఐదేళ్ల బాలికతోపాటు ముగ్గురు మరణించారు. మరో 24మంది తీవ్రంగా గాయపడ్డారు. పూంచ్, నౌషెరా సెక్టార్ పరిధిలోని రాజౌరీలో పాక్ సోమవారం మొదలుపెట్టిన మోర్టారు దాడులు, కాల్పులు మంగళవారం కొనసాగాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఎల్ఓసీ వెంబడి రాక్చిక్రి, రావలకోటె ప్రాంతాల్లో ఉన్న 7 పాక్ సైనిక స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ముగ్గురు పాక్ సైనికులు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారని పాక్ అధికారులు మీడియాకు వెల్లడించారు.





