
టీవీ9 వాటాల కొనుగోలులో ఎలాంటి అవకతవకల్లేవని, అన్నీ చట్టబద్ధంగానే జరిగాయని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ బుధవారం తీర్పు వెలువరించింది.
టీవీ9 లో వాటాలు కొనుగోలు చేసిన జూపల్లి జగపతిరావు, ఇతర డైరెక్టర్లను ఇబ్బంది పెట్టడానికి మాజీ సీఈవో రవిప్రకాశ్ చేసిన ప్రయత్నాలు అనైతికమని తప్పుపట్టింది. అందువల్ల ప్రతివాదులకు రూ.10 లక్షలు చెల్లించాలని రవిప్రకాశ్, కె.వి.ఎన్.మూర్తిలను ఆదేశించింది. టీవీ9కు చెందిన ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ వాటాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని, సంస్థను స్వాధీనం చేసుకున్నవారిని నియంత్రించాలంటూ ఛానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్, కె.వి.ఎన్.మూర్తిలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న ఎన్సీఎల్టీ బుధవారం తీర్పు వెలువరించింది. వాటాల విక్రయ ఒప్పందం రవిప్రకాశ్ కు తెలిసే జరిగిందని, ఆ ప్రక్రియలో ఆయన భాగమేనని పేర్కొంది.





