
చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా అతిపెద్ద నగరం, వాణిజ్య రాజధాని అయిన షాంఘైలో వైరస్ ఉద్ధృతి విపరీతంగా ఉంది.
దేశంలో మొత్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 70 శాతం ఈ ఒక్క నగరంలోనే బయటపడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన డ్రాగన్ సర్కారు.. షాంఘైలో వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టింది. పరీక్షలను పెంచడంతో పాటు పెద్ద ఎత్తున ఆరోగ్య కార్యకర్తలు, సైన్యాన్ని నగరానికి పంపింది.
చైనాలో గత కొద్ది రోజులుగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సోమవారం దేశవ్యాప్తంగా 13వేలకు పైగా కొత్త కేసులు నమోదవగా.. ఇందులో దాదాపు 9వేల కేసులు ఒక్క షాంఘైలోనే ఉండటం గమనార్హం. ఈ నగరంలో వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో గతవారం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. నగర వ్యాప్తంగా దాదాపు అన్ని కార్యకలాపాలను నిలిపివేసి, కఠినమైన లాక్డౌన్ విధించి.. ప్రజలను ఇళ్లకే పరిమితం చేసినప్పటికీ షాంఘైలో కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు సోమవారం నుంచి ట్విన్ కొవిడ్ పరీక్షలు మొదలుపెట్టారు. అంటే నగరంలో ప్రతి పౌరుడికి యాంటీజెన్, న్యూక్లిక్ యాసిడ్ పరీక్షలు చేస్తున్నారు.
ఇందుకోసం డ్రాగన్ ప్రభుత్వం సైన్యాన్ని సైతం రంగంలోకి దింపింది. ఆర్మీ, నేవీ నుంచి దాదాపు 2వేల మందికి పైగా సిబ్బందిని నగరానికి పంపింది. దీంతో పాటు దాదాపు 15 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బందిని షాంఘైకి తరలించినట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. షాంఘై పొరుగున ఉన్న జియాంగ్ జు, జెజియాంగ్ తదితర ప్రావిన్సుల నుంచి ఈ సిబ్బందిని నగరానికి పంపించారు.
ఆఫీసుల్లోనే తిండి, నిద్ర..

వైరస్ సంక్రమణ చైన్ ను తెగ్గొట్టడంతో పాటు, వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా షాంఘైలో కఠిన లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారు. క్లోజ్డ్ లూప్ వ్యూహంతో కొన్ని అత్యవసర వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు అనుమతినిచ్చారు. దీంతో ఆయా కంపెనీల సిబ్బంది బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఆఫీసుల్లోనే నిర్బంధంలో పనిచేస్తున్నారు. వాణిజ్య పరిశ్రమకు చెందిన వేలాది మంది స్టాక్ ట్రేడర్లు, ఇతర ఉద్యోగులు తమ తమ ఆఫీసుల్లోనే నిద్ర పోతున్నారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.





