
భారత నౌకాదళంలో త్వరలో ప్రవేశపెట్టనున్న యుద్ధనౌకకు ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖపట్నం పేరు పెట్టామంటూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిఫెన్స్ విభాగం జారీ చేసిన ప్రకటనలో వెల్లడించింది.
తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్సింగ్ శుక్రవారం (5/11/2021) ముఖ్యమంత్రి జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబరు 4న విశాఖలో జరిగే నేవీ డే ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరవ్వాలని ఆహ్వానించారు.
దానిపై పీఐబీ డిఫెన్స్ విభాగం పేరుతో విశాఖపట్నం నుంచి ఒక అధికారిక ప్రకటన విడుదలైంది. ”నేవీ డే ఉత్సవాలకు ముఖ్యమంత్రిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించడంతో పాటు, త్వరలో ముంబయిలో నౌకాదళంలో ప్రవేశపెట్టనున్న 15బి స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ విధ్వంసక నౌక గురించి వివరించారు. దానికి ఏపీ పరిపాలన రాజధాని విశాఖపట్నం పేరు పెట్టినట్టు చెప్పారు. 2022లో జరిగే ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ, మిలన్ కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రికి ఆయన వివరించారు” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో వైస్అడ్మిరల్ అజేంద్ర బహదూర్సింగ్ భేటీపై గురువారం సీఎం కార్యాలయం విడుదలచేసిన ప్రకటనలోనూ అదే అంశాన్ని ప్రస్తావించడం విశేషం.





