News

మీ ఎమ్మెల్యేలు అనుచితంగా ప్రవర్తించినా వారిపై కేసులు పెట్టరా? – కేరళ ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్న

463views

2015లో శాసనసభలో అనుచితంగా ప్రవర్తించిన ఆరుగురు సీపీఎం శాసనసభ్యులపై జరుగుతున్న విచారణను రద్దు చేయాలంటూ కేరళ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ ‌లో ఉంచింది. ఈ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేలపై విచారణ నిలిపివేయాలంటూ చేస్తున్న అభ్యర్థనలో ప్రజా ప్రయోజనం ఏమిటో చెప్పాలని నిలదీసింది. ఉదాహరణకు ఒక ఎమ్మెల్యే తుపాకీ తీస్తే, అది రాష్ట్ర శాసనసభలో జరిగింది కాబట్టి ఆయన్ను విచారించకూడదని అంటారా? ఆయనపై కేసు నమోదు చేయరా? అని ప్రశ్నించింది. అంతకముందు కేరళ ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది.. ప్రజా ప్రయోజనాల కోసమే ఆ ఎమ్మెల్యేలు శాసనసభలో కాస్త అనుచితంగా ప్రవర్తించాల్సి వచ్చిందని తెలిపారు.

అయినా వారికి శాసన సభ చట్టాల ప్రకారం రక్షణ ఉంటుందని పేర్కొన్నారు. దీనికి ధర్మాసనం స్పందించింది. న్యాయస్థానాల్లో కూడా తీవ్రస్థాయిలో వాగ్వాదాలు జరుగుతాయని, అంత మాత్రాన కోర్టు ఆస్తులను ధ్వంసం చేయడం సరైందేనా అని పేర్కొంది. ఎమ్మెల్యేలు సభాపతి కుర్చీని ధ్వంసం చేశారని, అది ప్రజల ఆస్తి కాదా? అని ప్రశ్నించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.