
కరోనా నేపథ్యంలో ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర వరుసగా రెండో ఏడాది కూడా భక్తులు లేకుండానే జరగనుంది. పూరీ రథయాత్ర జులై 12న జరగనుండగా ఈ సారి కూడా భక్తులను అనుమతించడం లేదని ఒడిశా ప్రభుత్వం తెలిపింది. రథయాత్రను కేవలం కేవలం పూరీలో మాత్రమే నిర్వహిస్తామని ఒడిశా ప్రత్యేక సహాయ కమిషనర్ పి.కె.జెనా వెల్లడించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో జగన్నాథ రథయాత్రలు ఉండవని తెలిపారు. సుప్రీంకోర్టు గత ఏడాది సూచించిన మార్గదర్శకాలను రథయాత్ర సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో చిత్తశుద్ధితో పాటిస్తామన్నారు. కరోనా నెగెటివ్ అని తేలి, టీకాలు తీసుకున్న వారిని మాత్రమే ఎంపిక చేసి స్నాన పూర్ణిమకు అనుమతిస్తామని వెల్లడించారు. రథయాత్ర రోజు పూరీలో కర్ఫ్యూ విధిస్తామని, గత ఏడాది వేడుక సందర్భంగా పాటించిన నిబంధనలను ఈసారి కూడా అమలు చేస్తామని తెలిపారు. భక్తులు పూరీ రథయాత్రను టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో వీక్షించాలని సూచించారు.





